ప్రముఖ బెంగాలీ దర్శకుడు తపన్ సిన్హాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం-2006 వరించింది. బెంగాలీ, హిందీ, ఒరియాల్లో అనేక చిత్రాలు రూపొందించిన ఈయనకు ఈ అవార్డు కింద పదిలక్షల రూపాయల నగదు బహుమతి, స్వర్ణ కమలం, శాలువాను అందజేయనున్నారు.
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా సిన్హా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. అయితే సిన్హాకు ఈ అవార్డును ఎప్పుడు అందజేయనున్నారన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. 84 ఏళ్ల తపన్ ఇప్పటికి వివిధ విభాగాల్లో 19 జాతీయ సినీ అవార్డులను సొంతం చేసుకున్నారు. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ పురస్కారాలను అందుకున్నారు.
మరోవైపు భారత 60వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తపన్ సిన్హాకు ఇటీవల "వన్ టైమ్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్" పురస్కారం ప్రదానం చేసింది. గత 1946లో కోల్కతాలోని న్యూ థియేటర్లో ఓ సౌండ్ ఇంజనీర్గా తన సినీ రంగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తదనంతరం మహతో, హన్సూలి, బంచారమర్ బగన్ వంటి పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
|