ఖండాంతర చలన చిత్రోత్సవానికి గోవా వేదిక కానుంది. ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు ఈ చిత్రోత్సవం జరుగనుంది. ఇందులో ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాలకు చెందిన 21 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవాలను గోవా అంతర్జాతీయ సెంటర్, మూవీయింగ్ ఇమేజెస్ గోవా, ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జి)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశాన్ని సందేశాత్మకంగా తీసుకొని చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకుల్లో ఒకరైన మూవీయింగ్ సంస్థ పార్ట్నర్ గాయత్రీ కొంకర్ తెలిపారు. మొత్తం 135 చిత్రాలు తమకు అందాయని, వీటిలో 21 సినిమాలను ప్రదర్శనకు ఎంపిక చేసినట్టు ఆమె చెప్పారు. ఈ ఖండాంతర చిత్రోత్సవాలు తొలిసారి 2002 సంవత్సరంలో అర్జెంటీనా జరిగినట్టు చెప్పారు.
ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. గత ఏడాది జరిగిన చిత్రోత్సవాలకు గోవా వేదికగా నిలిచిందని, ఈ దఫా కూడా తామే నిర్వహించేందుకు పూనుకున్నట్టు ఆమె చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై అవగాహన కల్పించడమే ఈ చిత్రోత్సవాల ముఖ్యోద్ధేశమని గాయత్రీ కొంకర్ తెలిపారు.
|