1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"హాలీడేస్" షూటింగ్ ప్రారంభం

వినోదం వెండితెర కథనాలు ఆర్సిఎం సినీ చిత్ర అనే నూతన నిర్మాణ సంస్థ హాలీడేస్ శివనాగ్ భార్గవి హీరోయిన్
WD
ఆర్.సి.ఎం. సినీ చిత్ర అనే నూతన నిర్మాణ సంస్థ "హాలీడేస్" అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. శివనాగ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ. రామిరెడ్డి నిర్మాత పగ్గాలు చేపడుతున్న ఈ సినిమాలో అష్టాచమ్మా ఫేమ్ భార్గవి హీరోయిన్‌గా నటిస్తోంది. శివనాగ్, భార్గవిలపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు పూరీ జగన్నాథ్ క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత స్విచ్ఛాన్ చేశారు. ఛోటా కె. నాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కొత్తదనం ఉంటుందన్నారు. ఈ చిత్రానికి క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని, బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.

ఈ నెల 20 నుంచి వైజాగ్, అరకు, పాలకొల్లు ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని, తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన "రామ్", "మహాత్మ" సినిమాలు విడుదలయ్యాయని వెల్లడించారు. వచ్చేనెలలో "భగవంతుడు" సినిమా తెరపైకి రానుందని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ... తమ బేనర్‌లో హాలీడేస్ మంచి చిత్రమవుతుందని, ఈ చిత్రం ద్వారా వచ్చిన నికర లాభంతో 25 శాతం చిత్ర యూనిట్‌కు కేటాయిస్తానన్నారు. ఈ చిత్రంలో సెంటిమెంట్ ముఖ్యమైన పాయింట్‌గా ఉంటుందని, ఆ పాయింట్ నచ్చే సినిమా తీయడానికి ముందుకొచ్చానని చెప్పుకొచ్చారు. లైఫ్‌లో ప్రేమ అనేది ఉండాల్సిందేనని, కానీ ఒక యాంబీషన్ అనేది చాలా ముఖ్యమని తెలియజెప్పే పాయింట్‌తో ఈ చిత్ర కథాంశం ఉంటుందని నిర్మాత తెలియజేశారు.

శివనాగ్ మాట్లాడుతూ... డిగ్రీ పూర్తయి విడిపోతున్న సందర్భంగా అందరూ ఓ పిక్నిక్‌కు ప్లాన్ చేస్తామని, ఆ నేపథ్యంలో జరిగే కథే ఇదని, చక్కని మెలోడి పాటలను శ్రీకాంత్, శ్రీధర్‌లు సమకూర్చారని వెల్లడించారు. గీతాంజలి, అభినందన తరహాలో మనస్సుకు హాయి కల్గించే ట్యూన్స్ వారు అందిచారని చెప్పారు.

భార్గవి మాట్లాడుతూ... హీరోయిన్‌గా ఇది తనకు తొలి సినిమా అని, హాలీడేస్ ఎంజాయ్ చేసే సమయంలో ప్రేమలో పడితే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయనే పాయింట్‌తో ఈ కథాంశం ఉంటుదన్నారు. పెద్దలకు ప్రాధాన్యత ఇస్తూ తన ప్రేమను ఎలా దక్కించుకున్నానన్న పాత్రలో నటించానని తెలిపారు.

ఇందులో ఆరు పాటలున్నాయని, నీతోనేనునా... నల్లబ్బాయ్-తెల్లమ్మాయి తర్వాత చేస్తున్న చిత్రమిదని సంగీత దర్శకులు శ్రీకాంత్, శ్రీధర్ పేర్కొన్నారు. మెలోడితో పాటు ఫాస్ట్‌బీట్ కూడా ఇందులో ఉన్నాయని వారు అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో పింగ్ పాంగ్, అదితి, పృథ్వీ, హంసి తదితరులు నటిస్తున్నారు. కెమెరా.. కళ్యాణ్ సమీ, ఎడిటింగ్... కె . రవీంద్రబాబు, ఆర్ట్. విజయకృష్ణ.
About Writer
Selvi