"ఎ ఫిలిం బై అరవింద్" ఫేం రిషి-హంసనందిని, కౌశల్-ప్రియాంకల కాంబినేషన్లో ఎన్.ఆర్.9 సినిమా పతాకంపై రూపుదిద్దుకుంటున్న సినిమా "ఒక్కటవుదాం". మురళీకృష్ణ దర్శకత్వంలో బి. అమ్మర్, ఎం. శ్రీను, సంగీతా శ్రీనివాసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ముంబైలో గ్రాఫిక్ వర్క్ జరిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... సంగీత దర్శకుడు కావాలనే సంకల్పంతో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన ఓ వ్యక్తి తన ఆశయాన్ని సాధించాడా? తను ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిణామాలు సంభవించాయనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతోందన్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డి.టి.ఎస్ ఫైనల్ మిక్సింగ్ జరుపుతున్నామని, ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటిలో హీరో రిషి, ప్రియాంకలపై ఒక మాస్ సాంగ్ను చిత్రీకరించామని నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
రిషి మాట్లాడుతూ... పక్కా మాస్ ఉండే పాత్రను ఈ చిత్రంలో పోషించానని, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమా తెరకెక్కించారని చెప్పారు. ఈ సినిమా తనకు మంచి గుర్తింపును సాధించిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడి పనితనం తనకెంతగానో నచ్చిందని వెల్లడించారు.
హీరోయిన్ హంసానందిని మాట్లాడుతూ... ఈ సినిమాలో తెలుగులో బిజీ అవుతాననే నమ్మకం ఉందని, ఇంత చక్కని అవకాశాన్నిచ్చిన నిర్మాతలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.