అమిగోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శేఖర్ కమ్ముల "ఆవకాయ్ బిర్యాని" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన అనీష్ కురివిల్లాను ఈ సినిమా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కమల్ కామరాజు, బిందు మాధవిలు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
ప్రసాద్ ల్యాబ్స్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... సిక్స్ సీటర్ ఆటో నడిపే కుర్రాడికి ఆవకాయ పచ్చళ్లు అమ్ముకునే ఓ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథే ఈ చిత్రమన్నారు. తానీ చిత్రానికి నిర్మాతగానే వ్యవహరించానే తప్ప దర్శకత్వ పర్యవేక్షణ చేయలేదని కమ్ముల చెప్పారు.
ఇది పూర్తిగా అనీష్ దర్శకత్వ శైలిలో ఉంటుందని, రెగ్యులర్గా తన చిత్రాల్లో ఉండే యూనిట్ కాకుండా, ఫ్రెష్ టీమ్తో రొమాంటిక్ లవ్ స్టోరీగా చిత్రాన్ని రూపొందించామని వెల్లడించారు. దాదాపు అందరూ కొత్తవారే ఈ సినిమాలో నటించారని, చిత్రంలో ఎక్కువ భాగం వికారాబాద్లో షూట్ చేశామన్నారు. ఈ నెల పదోతేదీన ఆడియోను, నవంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తున్నామని శేఖర్ కమ్ముల తెలిపారు.
దర్శకుడు అనీష్ కురివిల్లా మాట్లాడుతూ... కథపై, తనపై ఉన్న నమ్మకంలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. చిత్రంలో మంచి ఫీల్ ఉందని, ఈ చిత్రంతో చాలా రోజులకు తెలుగులో మంచి ఆడియో రాబోతుందని కురివిల్లా అన్నారు.