1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అర్థశతదినోత్సవంలో "కొత్తబంగారులోకం"

వినోదం వెండితెర కథనాలు అర్థశతదినోత్సవం కొత్తబంగారులోకం వరుణ్ సందేశ్ శ్వేతబసు ప్రసాద్ శ్రీకాంత్ అడ్డాల
వరుణ్ సందేశ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా శ్రీ వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకునిగా పరిచయవుతూ తెరకెక్కిన చిత్రం "కొత్తబంగారులోకం". "దిల్" రాజు నిర్మించిన ఈ చిత్రం అర్థ శతదినోత్సవానికి చేరువైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో 50 రోజుల వేడుకను ప్రేక్షకుల సమక్షంలో జరుపుకున్నారు. దిల్‌రాజు ఇటీవల డిస్ట్రిబ్యూషన్ చేసిన "యువత" చిత్ర కథానాయకుడు నిఖిల్, "వినాయకుడు" హీరో కృష్ణుడు తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా "దిల్" రాజు కృతజ్ఞతలు తెలిపారు.

ఆహుతి ప్రసాద్ స్పందిస్తూ... 20 నిమిషాల పాటు ప్రేక్షకుల మధ్య ఈ చిత్రాన్ని చూశానని, ఓ అమ్మాయి ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసిందో ఏమో గానీ, వచ్చే డైలాగ్‌ను ముందే చెప్పేస్తుందన్నారు. సినిమా ఎంత విజయం సాధించిందనడానికి ఇదొక నిదర్శమని ప్రసాద్ అన్నారు.

చెట్టు నెంబర్ వన్ అయితే... ఆటోమేటిక్‌గా కాయ నెంబర్ వన్ అవుతుంది... అనే సినిమా డైలాగ్‌ను మార్చి నిర్మాత నెంబర్ వన్ అయితే... సినిమా కూడా నెంబర్ వన్ అవుతుందని ఆహుతి ప్రసాద్ వెల్లడించారు. నిర్మాతల్లో కృషి, పట్టుదలతో పాటు సరైన జడ్జిమెంట్ ఉందని, ప్రతి సినిమాకు దిల్‌రాజు శ్రమే విజయవంతానికి కారణమని చెప్పారు.

నిఖిల్ మాట్లాడుతూ.. "కొత్తబంగారులోకం" ఓ క్లాసిక్ సినిమాలా నిలిచిపోతుందని, "దిల్" రాజుది గోల్డెన్‌ హ్యాండ్‌తో పాటు "గోల్డెన్ హార్ట్" అని కొనియాడాడు.

తనకు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు వరుణ్ సందేశ్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేక్షకుల అల్లరి నడుమ ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందన్నాడు.

డైరక్టర్ అవ్వాలని తీసిన తొలిచిత్రం హిట్ కావాలని ప్రతి దర్శకుడూ కలలు కంటాడని, తానూ అలాగే కలలు కన్నానని, అది నేడు నిజమైందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హర్షం వ్యక్తం చేశారు.
About Writer
SELVI.M