పైరసీ అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదమని, దీన్ని అరికట్టడానికి కలిసి పోరాడదామని అగ్రహీరో అక్కినేని నాగార్జున అన్నారు. అవసరమైతే ఈ పోరాటం కోసం 2, 3 సంవత్సరాల పాటు తాను సినిమా కూడా చేయకుండా సహకరిస్తానని నాగ్ స్పష్టం చేశారు. తాజాగా నాగ్ నటించిన "కింగ్" చిత్రం గురించి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.... అసభ్యత లేకపోవడంతో కుటుంబ సమేతంగా తన సినిమాను చూస్తున్నందంకు ఆనందంగా ఉందన్నారు. డబ్బింగ్, రీరికార్డింగ్తో పాటు ప్రతీదీ శ్రీనువైట్ల పర్యవేక్షణలో జరిగిందని నాగ్ చెప్పారు. తాను అనుకున్నది రాబట్టకునేందుకు శ్రీనువైట్ల ఏమాత్రం రాజీపడలేదని నాగార్జున తెలిపారు. ఇందులో శ్రీహరి పాత్ర తనతో సమానంగా ఉంటుందని, బ్రహ్మానందం, ధర్మవరపు పాత్రలు చిత్రానికి హైలైట్గా నిలుస్తాయని ఆయన చెప్పారు.
పైరసీ గురించి వివరిస్తూ... కర్నాటకలోని నటీనటులు పైరసీ నివారణకు పోరాడి 2, 3 సంవత్సరాల పాటు.. ఎవరూ సరిగ్గా సినిమాలు చేయలేదని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ఇదే జరిగిందని, వెంటనే అక్కడి ప్రభుత్వం పగడ్బంధీగా వ్యవహరించి కఠినమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పైరసీ ఎక్కువగా ఉందని, పైరసీ దారులను కఠినంగా శిక్షించాలని, నాన్బెయిలబుల్ వారెంట్తో వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చిత్రం విడుదల తర్వాత పబ్లిసిటీపై నిర్మాతల మండలి ఆంక్షలు గురించి మాట్లాడుతూ.. పరిమితంగా పబ్లిసిటీ ఇవ్వాలనే ఆంక్షలు పెట్టడం అన్యాయమన్నారు. ఈ విషయంలో కౌన్సిల్లో చాలాసార్లు తానే ప్రశ్నించానని, కానీ ఎవ్వరూ దీనికి సహకరించలేదని నాగార్జున వాపోయారు. మరోసారి వారితో చర్చలు జరపాలని నాగ్ పేర్కొన్నారు.
అగ్రహీరోల చిత్రాలను గురించి చెబుతూ... ఎన్టీఆర్, రామ్చరణ్ తేజ, మహేష్ బాబు వంటి వారు ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలని, వారంతా యువకులని.. అప్పట్లో తాము చాలా సినిమాలు చేసే వాళ్లమని గుర్తుచేసుకున్నారు.
త్వరలో అక్కినేని ఫిలిం అకాడమీని నెలకొల్పనున్నట్లు ఈ సందర్భంగా నాగార్జున ప్రకటించారు. తన కుమారుడు నాగచైతన్యను దిల్రాజు చేతిలో పెట్టానని, అభిమానులతో పాటు తనకూ చైతన్య చిత్రం చూడాలని చెప్పారు. పైకి అమాయకుడిలా కన్పించినా వాడిలో చాలా ఎనర్జీ ఉందని నాగార్జున వెల్లడించారు.