నూతన సంవత్సరంలో కొత్త నటీనటులతోపాటు సాంకేతిక సిబ్బందిని కూడా పరిచయం చేస్తానని ప్రముఖ నిర్మాత దిల్రాజు పేర్కొన్నారు. 2008 సంవత్సరం తనకు చాలా ఆనందాన్ని పంచిందని గుర్తు చేసుకున్నారు. 2008 ముగింపు సందర్భంగా... తన అనుభవాలను దిల్రాజు ఈ విధంగా వెల్లడించారు.
2003లో "దిల్" సినిమా విడుదలైందని, ఆ తర్వాత ఆరు సంవత్సరాల్లో ఏడు సినిమాలు తీశామని తెలిపారు. అవన్నీ హిట్టయ్యాయని చెప్పారు. తన బేనర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగాయని, అయితే 2008 తనకు స్పెషల్ అని చెప్పారు. ఎందుకంటే...? ఈ ఏడాది "పరుగు", "కొత్తబంగారులోకం" చిత్రాలు విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా... బయటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఉత్సాహాన్నిచ్చిందన్నారు.
"యువత", "వినాయకుడు", "ఉల్లాసంగా ఉత్సాహంగా" వంటి చిత్రాలు కూడా తానే పంపిణీ చేశానని, అవి కూడా హిట్ అయ్యాయని తెలిపారు. "కొత్త బంగారులోకం" నూరు రోజులకు చేరువవుతోందని, జనవరిలో "పరుగు", "కొత్తబంగారులోకం" 100 రోజుల వేడుక జరపబోతున్నామని చెప్పారు.
అదేవిధంగా ఈ ఏడాది కూడా తనకు ప్రాధాన్యతగలదని, ఈ ఏడాది తన పతాకంపై తొలిగా విడుదలవుతున్న సినిమా "ఆకాశమంత" అని, ఈ సినిమా తమిళంలో విడుదలైందని వెల్లడించారు. తెలుగులో కొంత షూటింగ్ చేయాల్సి ఉందని అన్నారు. జనవరిలో షూటింగ్ పూర్తి చేసి మార్చిలో "ఆకాశమంత" చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.
ఇదే ఏడాదిలో నాగచైతన్య చిత్రం ఆరంభమవుతుందని దిల్రాజు వెల్లడించారు. అలాగే దశరథ్ దర్శకత్వంలో చేసే సినిమా కథ ఫైనల్ అయిందని, వంశీ, శ్రీవాత్సవ్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేయబోతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం దర్శకులతోపాటు ఇతర సాంకేతిక నిపుణులను కూడా కొత్తగా పరిచయం చేయబోతున్నానని అన్నారు.