కిట్టూ, ఘటోత్కచ తర్వాత తెలుగులో యానిమేషన్ చిత్రాలు పెద్దగా రాలేదు. తాజాగా సైబర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 3డి యానిమేషన్లో "ఆలీబాబా 40 దొంగలు" అనే చిత్రం రూపొందింది. ఈ చిత్ర డీవీడీని సోమవారం విడుదల చేశారు.
ఫిలింఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ డీవీడీని ఆవిష్కరించారు. అనంతరం ఇదే సంస్థ పురాణాల నేపథ్యంలో రూపొందించిన 11 భక్తి డీవీల పోస్టర్ను నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. యానిమేషన్ సినిమాలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయన్నారు. సినిమాల్లో ఆర్టిస్టులు లేకుండా కొన్ని సన్నివేశాలను యానిమేషన్ ప్రక్రియ ద్వారా చేయవచ్చునని, అదే పూర్తి యానిమేషన్ చిత్రమైతే ఎంతో వెసులుబాటుగా దర్శకుడు అనుకున్నట్లు తీర్చిదిద్దవచ్చునని తమ్మారెడ్డి వివరించారు. ఇటువంటి యానిమేషన్ చిత్రాలు మరిన్ని రావాలని తమ్మారెడ్డి ఆకాంక్షించారు.
ఇ.వి.వి. మాట్లాడుతూ.. పిల్లలకు వినోదంతో పాటు ఎడ్యుకేట్ చేసేవిగా యానిమేషన్ చిత్రాలుంటాయని, మంచి మంచి కథలతో చిత్రాలు వస్తుంటాయని, ఇందులో శ్రమకు తగ్గ ఫలితం కన్పిస్తుందన్నారు.
సంస్థ అధినేత పెండ్యాల రాంబాబు మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ప్రపంచంలో యానిమేషన్ రంగం పురోగమించిందని, కానీ ఇండియాలో ఇంకా అంతగా రాలేదని చెప్పారు. తన సంస్థ చేస్తున్న ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.