ఆ డబ్బంతా బ్రహ్మానందం దగ్గరే ఉంది..!
|
ఈ విషయాలపై శివాజీ రాజా స్పందిస్తూ.. 8ఏళ్ళ క్రితం స్వర్గీయ రేలంగి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, తనతో పాటు బ్రహ్మానందం, మల్లికార్జునరావు మరి కొంతమంది హాస్యనటీనటులు ట్రస్ట్గా ఏర్పడి చందాలు పోగుచేశామన్నారు. కానీ బ్రహ్మానందం తనకు పేరు రావడం లేదని తనపై విమర్శల దాడి చేశారని వాపోయారు.
తన డబ్బంతా తానే స్వకార్యాలకు వినియోగిస్తున్న తరుణంలో.. రేలంగి విగ్రహం చందా డబ్బును తినేశానని వెల్లువెత్తిన ఆరోపణలు అసత్యమని శివాజీ రాజా నొక్కి చెప్పారు. ఆ డబ్బంతా.. బ్రహ్మానందం దగ్గరే ఉన్నాయని, అప్పటికే నాలుగు లక్షలు పోగయ్యాయని రాజా వెల్లడించారు.
కావలసినంత చందా పోగైనప్పటికీ రేలంగి విగ్రహ ప్రతిష్ట కార్యరూపం దాల్చలేదని, దీనికి బాధ్యుడు బ్రహ్మానందమేనని శివాజీ రాజా తెలిపారు. అప్పుడే తాను ప్రెస్మీట్ పెట్టి చెప్పానని, ఆనాడు బ్రహ్మానందం తననెంతో మానసికంగా హింసించారని రాజా ఆరోపించారు. తోటి నటులనే ఈ విధంగా హింసిస్తే.. ఇక కొత్త నిర్మాతలు, దర్శకులను ఆడుకుంటారని... ఇది ముమ్మాటికి సత్యమని రాజా వెల్లడించారు.
మరోవైపు... తన తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదని వారు కోర్టుకు వెళ్లారు. కొడుకుగా వారికి కావాల్సినవన్నీ చేశానని, కానీ వారు తృప్తి పడలేదని శివాజీ రాజా అన్నారు. చాలాసార్లు కొన్ని వార్తలు వింటునే ఉంటాం... ఇందులో... పలానా సినిమా హీరోయిన్ను వారి తల్లిదండ్రులే బలవంతంగా ఆమెతో ఏదో చేయిస్తున్నారని, ఆమె ఆస్తినంతా లాక్కుంటున్నారనే వార్తలు మన చెవిని తాకుతూనే ఉంటాయని రాజా గుర్తు చేశారు.
ఇదే పరిస్థితి తనదని, ఇందుకే అప్పట్లో కోర్టుకు వెళ్లానని శివాజీ రాజా చెప్పారు. తాను చాలా కష్టపడి పైకి వచ్చానని, ఇప్పుడు ఏసీకారులో తిరుగుతున్నానని ఆయన అన్నారు. తన అవసరాలు తనకున్నాయని, తల్లిదండ్రులు, తోబుట్టువులు మాత్రం ఆ సౌకర్యాలు కావాలని పోరు పెడుతున్నారని రాజా వాపోయారు.
తల్లిదండ్రులను కాపాడటం తన బాధ్యత కాబట్టి వారికి ఓ కారు ఏర్పాటు చేశానని, కానీ తోబుట్టువులు, తల్లిదండ్రుల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలుగా ఉన్నాయని.. అవి చెప్పడానికే సిగ్గుగా ఉందని శివాజీ రాజా వెల్లడించారు. తల్లిదండ్రుల విషయమై తాను చాలా మానసిక క్షోభకు గురయ్యానని ఆయన ఆవేదనను వెళ్లగక్కారు.