భారతీయ సంగీతం మరోసారి విశ్వ వేదికను అలకరించింది. వాహ్ తాజ్ అంటూ అందరికీ సుపరిచితులైన ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ ప్రఖ్యాత గ్రామీ అవార్డు గెల్చుకోవడం ద్వారా భారతీయ సంగీత మధురిమ పాశ్చాత్య దేశాలవారూ రుచిచూచే అవకాశం లభించింది.
ఇప్పటికే ఒకసారి గ్రామీ అవార్డును సొంతం చేసుకున్న జాకిర్ మరోసారి తన సంగీతంతో గ్రామీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. సమకాలీన ప్రపంచ సంగీతం అనే విభాగం కింద జాకిర్ భాగస్వామ్యంతో రూపొందిన గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ అనే ఆల్బంకు ఈ గ్రామీ అవార్డు లభించింది.
లాస్ఏంజెల్స్లో జరిగిన 51వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందర్భంగా సోమవారం జాకిర్ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో 1991లో మైకీ హార్ట్ అనే పాశ్చాత్య సంగీత విద్వాంసునితో కలిసి జాకిర్ రూపొందించిన ప్లానెట్ డ్రమ్ ఆల్బం తొలిసారిగా గ్రామీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం గ్రామీని సొంతం చేసుకున్న గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ సైతం వీరిద్దరి భాగస్వామ్యంలోనే రూపొందడం విశేషం. ప్రస్తుతం గ్రామీ అవార్డును సొంతం చేసుకున్న గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్టు ఆల్బం తయారీలో జాకిర్, మైకీ హార్ట్లతోపాటు నైజీరియాకు చెందిన సికిరు అడె పోజు, ప్యూర్టోరికాకు చెందిన గియోవని హిడల్లోలు కూడా పాలుపంచుకున్నారు.