తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన విశేషాలను ప్రసారం చేయకూడదంటూ మూడు ప్రముఖ ఛానెల్స్పై నిషేధం వేటు పడింది. మాటీవీ, ఈటీవీ, జెమినీ టీవీలపై చలన చిత్ర వాణిజ్య మండలి నిషేధం విధించింది. ప్రముఖ ఛానెల్స్లో గంటపాటు సినిమా ట్రైలర్స్ను ఉచితంగా ప్రదర్శించే ఏర్పాటు చేయాలని పలువురు నిర్మాతల విజ్ఞప్తి మేరకు టీవీ ఛానెల్స్కు ఛాంబర్ తమ విజ్ఞప్తిని విన్నవించింది. ఈ విషయమై ఛాంబర్ అధికారులు ఆదివారం చర్చలు జరిపారు. కానీ మాటీవీ, ఈటీవీ, జెమినీ టీవీలు మాత్రం పై నియమానికి అంగీకరించలేదు.
దీంతో చలన చిత్ర రంగ విశేషాలను పై మూడు ఛానెల్స్కు తెలియజేయరాదని పేర్కొంటూ, ఈ విషయాన్ని అన్ని సినిమా కార్యాలయాలకు, నిర్మాతలకు, దర్శకులకు ఛాంబర్ సర్కులర్ జారీ చేసింది.
ఈ విషయమై ఛాంబర్ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు ఛానెల్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. సినిమాను నమ్ముకుని ఎందరో బతుకుతున్నారని, ఛానెల్స్ కూడా సినిమా కవరేజ్లపైనే ఆధారపడుతోందని గుర్తు చేశారు. చిన్న చిత్రాలు నిర్మించి వాటిని విడుదల చేసేందుకు నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారని, అటువంటి వారికి కాస్తాకూస్తో న్యాయం చేయాలని రామారావు సూచించారు.
ఛానెల్స్ కాస్త సహృదయంతో స్పందించి, పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా ఉచితంగా ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని రామారావు పేర్కొన్నారు.
అప్పటికే ఈ విషయమై ఒక అభిప్రాయానికి వచ్చిన మా టీవీ, జెమినీ అధికారులు ఈ నిర్ణయానికి అడ్డుకట్ట వేస్తున్నందుకు క్షమించండని సమావేశం నుంచి వెళ్లిపోవడం జరిగింది.
ఇకపోతే.. ఈ నిషేధం ఎన్నాళ్ళుంటుందో వేచి చూడాల్సిందేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటారా.. గతంలో చిత్రం షూటింగ్ సందర్భంగా స్టూడియో రౌండప్ అనే పేరుతో.. షూటింగ్ను కవర్ చేస్తూ, టీవీల్లో ముందుగానే వేయడం పట్ల కొందరు అభ్యంతరం తెలియజేశారు. ఈ అభ్యంతరాలపై ఛాంబర్ స్పందిస్తూ ఆ ఛానల్స్పై నిషేధం విధించింది. ఆ తర్వాత కొందరు పెద్దల జోక్యంతో ఛాంబర్ వెనక్కు తగ్గింది. మరి ఈ నిర్ణయం కూడా.. ఎంతకాలం పనిచేస్తుందో చూడాలి.
ఎందుకంటే.. ఆల్రెడీ నిషేధానికి గురైన పై మూడు ఛానల్స్కు నిర్మాణరంగంలోనూ, పెద్దహీరోలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. మరి వారు ఎలా స్పందిస్తారో.. చూడాలిగా..!?