"ప్రజాతీర్పు", "అన్నసైన్యం" వంటి చిత్రాలను నిర్మించిన బండారు భాస్కరరాజా తాజాగా "ఊరికొక ఠాగూర్" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన బి.ఆర్.నాయుడుగా వ్యవహరిస్తున్నారు. సెన్సార్ సభ్యురాలు చందవోలు శోభారాణి సారథ్యంలో గంగోత్రి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
సారథి స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తపు షాట్కు దర్శకుడు సాగర్ క్లాప్కొట్టగా, శోభారాణి స్విచ్ఛాన్ చేశారు. ఆర్.కె.గౌడ్ దర్శకత్వం వహించారు. శ్రీనివాసరెడ్డి జ్యోతిప్రజల్వన గావించారు.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. సమాజ సంస్కరణోద్యమంలో భాగంగా అవినీతి రహిత సమాజం కోసం "ఊరికొక ఠాగూర్" చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. మంచి కథ, కథనంతో భాస్కర రాజా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారని చెప్పారు.
దర్శకుడు బి.ఆర్.నాయుడు మాట్లాడుతూ.. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల నేపథ్యంలో సాగే చిత్రమిదన్నారు.ఇందులో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని, మార్చి 1 నుంచి 40 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఈ చిత్రం షూటింగ్ నిర్వహిస్తామని దర్శకుడు తెలిపారు. ఇందులో కొంతమంది వికలాంగులు కూడా నటిస్తున్నారని, విష్ణుశ్రీ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణాగా నిలుస్తుందన్నారు.
ఈ చిత్రంలోని పాటలు నాగేంద్రబాబు విని మెచ్చుకున్నారని గీత రచయిత విష్ణుశ్రీ తెలిపారు. ఇప్పటికే ఐదు పాటల రికార్డింగ్ పూర్తయిందని సంగీత దర్శకుడు లక్ష్మీవినాయక్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్.కె.గౌడ్, గాజుల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.