సినీ "మాస్టార్స్.కామ్" ప్రారంభం
|
ఈ సందర్భంగా మా అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ.. "మా" 15వ వార్షికోత్సవం సందర్భంగా నటీనటుల వివరాలు, విశేషాలను తెలిపే వెబ్సైట్ను ప్రారంభించామని, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న నటీనటులను సన్మానించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
దాసరి మాట్లాడుతూ.. నటుడుగానే కాకుండా సినిమా పరిశ్రమలో అనేక సంచలనాలకు కారణం కృష్ణ అని ప్రశంసించారు. ఆలస్యంగానైనా ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడం ఆనందదాయకమని తెలిపారు. హీరోగా ఉన్నకాలంలో కృష్ణ 10 సంవత్సరాల పాటు రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారని, ఆయనను నేటి హీరోలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం టీవీ పరిశ్రమ నటీనటులకు ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి సరిపోతుందని, అది లేకుంటే సినిమా పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారని దాసరి ఎత్తిచూపారు. కాబట్టి ఇప్పటికైనా హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుందని సూచించారు.
డాక్టర్. రామానాయుడు మాట్లాడుతూ.. నటీనటులు సంపాదించడమే కాకుండా ఓ చారిటబుల్ ట్రస్టు పెట్టి దానికి నిధులు సమీకరించి పేద కళాకారులకు, సాంకేతిక నిపుణులకు సహాయం చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ కృష్ణ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎన్టీఆర్ అవార్డు అందుకున్న దాసరి, నంది అవార్డులందుకున్న వెంకటేష్, ఛార్మీ, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, ఝాన్సీలను సత్కరించారు.