ముమైత్ "స్నేక్ డ్యాన్స్" సూపర్..!
|
ఈ పున్నమినాగు లోకకళ్యాణానికి ఏమి చేసిందనేదే పాయింట్ అని, ఇందులో ముమైత్ ఖాన్ వేసిన స్నేక్డాన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఎస్.ఎ. రాజ్ కుమార్ సమకూర్చిన సంగీతం అద్భుతంగా ఉందని దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో కొనియాడారు.
ఈ సందర్భంగా.. ఎస్.ఎ. రాజ్కుమార్ మాట్లాడుతూ.. మెలోడీ సంగీతాన్ని మాత్రమే అందించే తనకు ఈ చిత్రం చేయమని చెప్పినప్పుడే కొద్దిగా తడబడ్డానని అన్నారు.
కోదండరామిరెడ్డి, యుండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖులు కలిసి పనిచేస్తున్న చిత్రమంటేనే ఏదో ప్రత్యేకత ఉంటుందని భావించి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చేందుకు అంగీకరించానని రాజ్కుమార్ చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ఈ టైటిల్ వినగానే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమానే గుర్తుకు వస్తుందని, చాలా కాలం తర్వాత పాము కథాంశంతో "పున్నమినాగు"ను తెరకెక్కించనున్నామని తెలిపారు.
ఈ సినిమా కోసం ఎన్నో కథలు పరిశీలించి యండమూరి రాసిన కథను ఎంచుకుని ఫైనల్ చేశామని కోదండరామిరెడ్డి వివరించారు. చక్కని పాయింట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
యండమూరి మాట్లాడుతూ.. ప్రపంచ వినాశనాన్ని కాపాడిన నాగుపాము కథే ఈ చిత్రమని చెప్పారు. ఈ చిత్రానికి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఒకటి రెండు చిత్రాలు సక్సెస్ తోనే ఇప్పటి దర్శకులు అందుబాటులో ఉండరని, అలాంటిది నూరు చిత్రాలకు దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డిలో ఉన్న సౌమ్యం తనకెంతో నచ్చిందని రచయిత వెలిగొండ శ్రీనివాస్ అన్నారు.
ఇంకా ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజకీయ నాయకులు ఎస్.వి. సుబ్బారెడ్డి, భూమానాగిరెడ్డి, సినిమా రంగ ప్రతినిధులు బెల్లంకొండ సురేష్, సి. కళ్యాణ్, ముమైత్ సోదరి సజన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.