రియల్స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో, ఆర్యన్ రాజేష్, శ్రద్ధాఆర్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రోమియో". రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సుధా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని నిర్మాత శ్రీనివాస్ అన్నారు.
మిగిలిన రెండు పాటలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు చిత్రీకరించనున్నామని, 5 నుంచి ఆడియో ఫంక్షన్ నిర్వహించి, 6 నుంచి 8వరకు పబ్ సాంగ్ తీస్తామని వివరించారు. డిఫరెంట్ స్క్రీన్ప్లేతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో శ్రీహరి, రాజేష్ పాత్రలు నువ్వానేనా అనే రీతిలో సాగుతాయని నిర్మాత అన్నారు. కొత్త దర్శకుడయినా రామకృష్ణ అన్ని వర్గాల వారిని ఆకట్టురునే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. యాక్షన్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న థ్రిలింగ్ లవ్స్టోరీ ఇదని, సన్నివేశాలన్నీ కొత్తగా ఉంటాయన్నారు. కథవిని తనపై నమ్మకంతో ఈ చిత్రం చేయడమే కాకుండా అన్నివిధాల ఎంతో సహకరిస్తున్న శ్రీహరికి దర్శకుడు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే కొత్త ఆర్యన్ రాజేష్ను ఈ సినిమాలో చూస్తారని, నిర్మాణపరంగా ఏ మాత్రం రాజీపడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని దర్శకుడు వెల్లడించారు.
ఇంకా ఈ సినిమాకు సంగీతం.. అగస్త్య, కెమేరా.. రాజేంద్ర, పాటలు.. వనమాలి.