అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ జోషిత సమర్పణలో రూపొందుతోన్న "రాత్రి" చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. రాత్రులన్నీ ఒకేలా ఉండవని, కొన్ని రాత్రులు చేదు అనుభవాలను మిగులుస్తాయని, మరికొన్ని మధురానుభూతుల్ని మిగులుస్తాయని ఆడియో విడుదల సందర్భంగా దర్శకుడు భానుకిరణ్ చెప్పారు. ఈ ఆడియో కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ, చంద్రబోస్, వి.ఎన్. ఆదిత్య, ఏవీఎస్, కెమేరామెన్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. మంచి నటుడిగా షాయాజీ షిండే నటిస్తూ ప్రముఖుల జాబితాలో చేరాడని, గతంలో తాను నిర్మించిన చిత్రంలోనూ నటించాడని చెప్పారు. అతనికి మంచి భవిష్యత్ ఉందని తమ్మారెడ్డి వెల్లడించారు.
ఏవీఎస్ మాట్లాడుతూ... హారర్ చిత్రాలకు ఆదరణ వస్తున్న తరుణంలో ఇటువంటి చిత్రాలు రావడం చాలా మంచిదన్నారు. చిన్న చిన్న చిత్రాలు చేయడం విడుదల చేయడం సాహసంతో కూడిన పని అని, ప్రస్తుతం థియేటర్లు దొరకడం లేదని చిత్ర నిర్మాత ఆర్. కిరణ్ కుమార్ అన్నారు. ఇలాంటి తరుణంలో షిండే ఈ సినిమా చేస్తానని ముందుకు రావడం సగం విజయంతో సమానమని, ఆయన వల్లే ఈ చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకముందన్నారు.