సిద్ధార్థ హీరోగా షామిలి కథానాయికగా నటిస్తోన్న చిత్రం "ఓయ్". డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్రంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఇటీవల రామానాయుడు స్టూడియోలో విడుదలైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె. రాఘవేంద్ర రావు ఆడియో సీడీని విడుదల చేసి తొలి ప్రతిని రాజమౌళికి అందజేశారు. ఆడియో కేసెట్ను హీరో ప్రభాస్ విడుదల చేసి డి. సురేష్ బాబుకు అందజేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. దర్శకుడి తొలి సినిమాకే సిద్ధార్థ లాంటి చురుకైన హీరో లభించడం అదృష్టమన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం చాలా బాగుందని ప్రశంసించారు.
జయం మనదే సినిమాలో ఆనంద్ ప్రవర్తన గమనించానని, ఆయన మాటల పొదుపరి. మంచి ప్రతిభగల వ్యక్తి. ఓయ్ సినిమాతో ఆయనకు మంచి ఛాన్సులొచ్చే అవకాశముందని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.
హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ చాలా బాగుందని, ఈ సినిమాలో తానే పాడిన ఓ పాటను సిద్ధార్థ తనకు వినిపించారని చెప్పారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ప్రభాస్ ఆకాంక్షించారు.
గీత రచయిత వనమాలి మాట్లాడుతూ.. తన కెరీర్ ఇళయరాజాతో ప్రారంభమైందన్నారు. తర్వాత కార్తీక్రాజాతో పనిచేశానని, ప్రస్తుతం యువన్ శంకర్ రాజాతో చేస్తున్నాని తెలిపారు. తాను రాసిన పాటను యువన్ శంకర్ రాజా పాడడం తనకెంతో ఆనందం కల్గించిందన్నారు.
సిద్ధార్థ మాట్లాడుతూ.. ఇకపై ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. బొమ్మరిల్లు చేస్తున్నప్పటి నుంచి ఫలానా తరహా సినిమాను, ఫలానా దర్శకుడితో చేయాలని భావించే వాడినని, ప్రభుదేవా తర్వాత గోవింద్ను నమ్మానని సిద్ధార్థ చెప్పారు.
ఇందులో యువన్ శంకర్ రాజా సంగీతం చాలా బాగుందని, కథానాయిక షామిలితో నటించడం జాతీయ అవార్డు గ్రహించిన అమ్మాయితో నటించినట్లు ఫీలయ్యానని సిద్ధార్థ అన్నారు.