ఇంటిలో పని చేస్తున్న పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణ కేసులో బాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజాను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన్ను సోమవారం కోర్టులో హాజరుపరుచనున్నారు. 19 సంవత్సరాల యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అహుజాను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
అంధేరీలోని ఒషివారా పోలీసు స్టేషన్లో బాధిత యువతి ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటుడిపై ఫిర్యాదు చేసింది. షైనీని అరెస్టు చేశామని, అతని వద్ద విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత ఒక యేడాది కాలంగా అహుజా నివాసంలో ఇంటి పని చేస్తోంది.
తనపై అత్యాచారానికి ప్రయత్నించినపుడు అహుజా భార్య ఇంటిలో లేదని, ఆ సమయంలో తనను పడకగదిలోకి తీసుకెళ్లి, బలవంతపు అత్యాచారం చేసినట్టు చెప్పింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల సమయంలో జరిగినట్టు ఆ యువతి చెప్పింది. సంఘటన జరిగిన తర్వాత యువతి తన బంధువుల ఇంటికి వెళ్లిందని, అక్కడ నుంచి సొంతవారిని వెంటబెట్టుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు డీసీపీ నికిత్ కౌషిక్ వివరించారు.
కాగా, ఈ సంఘటనపై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ మాట్లాడుతూ.. ఈ వార్త ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్ననే షైనీతో మాట్లాడాను. అత్యాచారానికి పాల్పడినట్టు షైనీ తేలితే తాము తీవ్రంగా ఖండిస్తామని చెప్పారు. వివాహితుడైన షైనీకి భార్య అనుపమా అహుజా, రెండేళ్ళ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్యా, కూతురు విదేశాలకు వెళ్లి ఉండటంతో షైనీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.