అందాల తార మీనా నటిస్తోన్న "వెంగమాంబ" చిత్రం పాటలను ఇటీవలే తిరుమల సన్నిధానంలో చిత్రీకరించారు.
వి.ఎం.సి. ప్రొడక్షన్స్ సంస్థపై రూపుదిద్దుకుంటోన్న వెంగమాంబ పాటలపై ప్రముఖుల స్పందన కార్యక్రమం హైదరాబాద్లో ఇటీవలే జరిగింది.
ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ చిత్ర కథా రచయిత్రి ముక్తేవి భారతి మాట్లాడుతూ, వెంగమాంబ జీవిత కథను తాను రాశానని తెలిపారు. దాన్ని సీరియల్, సినిమాలుగా తీసిన దొరస్వామిరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సినిమాలో సంగీతం చాలా బాగుంది. పాటల్లో వెంగమాంబలోని పలు కోణాలను స్పశించారు. పాటలు వింటుంటే ఇంపుగా ఉన్నాయని, ఈ పాటల్లో జావళిలు జానపదాలున్నాయని భారతి వివరించారు. బాలు, సునీత, రమ్య తమ మధురమైన కంఠస్వరాలతో ఆ పాటలకు జీవం పోశారని ఆమె వెల్లడించారు.
కీరవాణి బాణీలంటే వినడానికి ఇంపుగా ఉంటాయని టి.డి.పి. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.వి.ఎస్.ప్రసాద్ కొనియాడారు. అభిరుచిగల నిర్మాత దొరస్వామిరాజు ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రంకూడా అన్నమయ్యలాగా మంచి హిట్ అవుతుందని చదలవాడ శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
చిత్ర దర్శకుడు ఉదయభాస్కర్ మాట్లాడుతూ, వెంగమాంబ కేవలం శ్రీవేంకటేశ్వరుని భక్తురాలేకాదు. మహిళా సమస్యలపై ఉద్యమించిన విప్లవ వనిత. స్వామివారికి తాళ్ళపాకవారి లాలిపాట, తరిగొండ వారి ముత్యాల హారి.. ఈ రెండూ నిర్మించే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఇందులో 21 పాటలున్నాయి. తప్పకుండా ఈ పాటలు శ్రోతలను అలరిస్తాయని దర్శకుడు ఆశించారు.
కీరవాణి మాట్లాడుతూ, పాటలకు మంచి స్పందన వచ్చింది. 4,5 పాటలు చాలా బాగున్నాయని ఫోన్లద్వారా శ్రేయోభిలాషులు తెలిపారని వెల్లడించారు.
భారవి మాట్లాడుతూ, వైధవ్యం సంభవిస్తే మహిళలు గాజులు, వెంట్రుకలు ఎందుకు తీసేయాలని స్వామివారిని ప్రశ్నించిన తొలిమహిళ వెంగమాంబ. కాళిదాసు, శంకరాచార్యులు తర్వాత అక్షరజ్ఞానంలేని వెంగమాంబ కవయిత్రి కావడం వేంకటేశ్వరుని కృపే.
ఇటువంటి చిత్రాన్ని తీసిన దర్శకనిర్మాతలు ధన్యులు అని భారవి చెప్పారు. ఈ చిత్రాన్ని వచ్చేనెలలో విడుదలచేయనున్నామని దొరస్వామిరాజు వెల్లడించారు.