అంతర్జాతీయ ప్రమాణాలతో థాయ్లాండ్తోపాటు పలు ప్రాంతాల్లో మన తెలుగు చిత్రాన్ని ప్రదర్శించేందుకు వైట్ లోటస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యోగ గురువు, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సంపాదించిన కమల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ మై గాడ్' అనే పేరు పెట్టారు.
కమల్ శిష్యుడు సేతు మాధవన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, పలు యాడ్స్ చేసిన గిరిధర్ గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్లోని నానక్రామ్ గూడాలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో థాయిలాండ్కు చెందిన జైకా గ్రూప్, రామ్లక్ష్మణ్లు, నందు ఫైట్ మాస్టర్స్గా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర వివరాలను తెలియజేస్తూ, సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఆగస్టు 5వరకు జరిగే షెడ్యూల్తో షూటింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత మూడు నెలల్లో సినిమాను విడుదలచేస్తామని చెప్పారు.
ముగ్గురు ఫైట్మాస్టర్స్తో ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ తెరెక్కిస్తున్నాం. కథాపరంగా చెప్పాలంటే.. కర్మనుసారమే ఫలితం అనేది దైవ నిర్ణయం. ఈ నేపథ్యంలో సినిమా సాగుతుందన్నారు. ఇంకా శంకరాచార్య అద్వైతం సిద్ధాంతాన్ని ఈ సినిమాలో స్పృశించామని దర్శకుడు తెలియజేశారు. చూసిన ప్రేక్షకులంతా 'ఓ మై గాడ్' అనేలా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.
నిర్మాత సేతు మాధవన్ మాట్లాడుతూ, టోనీజా, జాకీచాన్, జెట్లీ తర్వాత ఇండియా అనగానే కమల్ గుర్తుకు వచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తిరుపతిలో టీబంక్ నడిపే వ్యక్తి కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని చెప్పారు.
కమల్ మాట్లాడుతూ, ఇండియాలో పుట్టి సింగపూర్లో పెరిగి పలు దేశాల్లో యోగ గురువుగా పేరు తెచ్చుకున్న తాను సినిమాలో నటించడం ఇదే తొలిసారి అన్నారు. అందరూ మెచ్చే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు.