ఆర్తీ అగర్వాల్ "నీలవేణి"గా నటిస్తోన్న చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆర్తి సరసన ముకుల్దేవ్ నటిస్తున్నాడు. పోసాని కృష్ణ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎంజీఆర్ కంబైన్స్ పతాకంపై గిరీష్ కుమార్ నిర్మిస్తుండగా భరత్ పారేపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిషాట్కు రామానాయుడు క్లాప్ కొట్టగా, డి. సురేష్ బాబు స్విచ్చాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అన్నారు. చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తామనీ, ముకుల్దేవ్ పలు అగ్ర హీరోల చిత్రాల్లో విలన్గా నటించాడనీ, ఆ పాత్రకు అతడైతేనే సరిపోతాడనిపించి ఎంపిక చేశామన్నారు.
ఆర్తీ అగర్వాల్ మాట్లాడుతూ... తన రెండో ఇన్నింగ్స్లో ప్రారంభిస్తున్న తొలి చిత్రమిదని తెలిపారు. మాటల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు మాట్లాడుతూ, చట్టం ఓ ప్రేమ జంట విడిపోవడానికి కారణమవుతుందనీ, ఆ తర్వాత ఆ నీలవేణి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నదే చిత్ర కథాంశమని తెలిపారు.
బ్రాందీలు తాగుతూ గాంధీని పొగిడే రాజకీయ నాయకుల తీరు కూడా ఈ కథలో మిళితమై ఉంటుందన్నారు. ఇంకా ఈ చిత్రంలో గీతాసింగ్, ఎం.ఎస్. నారాయణ, రవికాలే, రవిప్రకాష్, శివపార్వతి, ఆదిత్యాఓం తదితరులు నటిస్తున్నారు. సంగీతం: లలిత్ సురేష్, కెమేరా: ఎ.ఆర్.బాబు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ పారేపల్లి