తెలుగు చలనచిత్రరంగంలో రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతల శాతం తగ్గిపోయింది. దేవీవరప్రసాద్, కె.ఎస్.రామారావు. కె.ఎల్.నారాయణ, అశోక్ కుమార్... ఇలా చాలామంది సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. వారంతా నిర్మాణవ్యయం పెరిగిపోవడం ప్రధానకారణంగా చెబుతారు.
రామానాయుడు వంటి అగ్రనిర్మాత మాత్రం పెద్దహీరోల చిత్రాలు చేయనని ఎప్పుడో చెప్పారు. రవితేజతో సినిమా తీయాలనుకునే టైమ్లో ఆయన చెప్పినరేటు విని ఆశ్చర్యపోయానని ఓ సందర్భంలో చెప్పారాయన. మిగిలింది కొత్త నిర్మాతలు. వారు సినిమా తీయడానికి వస్తే ఆ తర్వాత పలురకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
కానీ ఎవరికివారు తమ సినిమా రిలీజ్వరకు ఓపికతో వ్యవహరిస్తుంటారు. ఆ తర్వాత సరైన థియేటర్లు దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు చాలామంది ఎదుర్కొన్నారు. కోడిరామకృష్ణతో సినిమా తీసిన ఎన్.ఆర్.ఐ. డాక్టర్ ఒకాయన 'జెండా' పేరుతో భారీ బడ్జెట్ సినిమా తీసి, అది ఫెయిలయ్యాక... చివరికి విమానం టిక్కెట్కోసం స్నేహితుల్ని అడిగి అమెరికా వెళ్ళాడు.. దాంతో సినిమా తీయననే నిర్ణయానికి వచ్చాడు.
ఒకప్పుడు కోడిరామకృష్ణ అమెరికా వేళితే ఆ డాక్టరే ఆయనకు ఆతిథ్యమిచ్చేవాడు. ఆయనకు సినిమాపైగల వ్యామోహం చూసి కోడిరామకృష్ణ ముగ్గులో దించారు. ఈ విషయాన్ని నిర్మాతే బహిరంగంగా చెప్పాడు. ఏదిఏమైనా ఇలాంటివి చలనచిత్రరంగంలో ఇంకా చాలానే ఉన్నాయి.