1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio

Anjaneyulu| Audio| Release| Dasari| Raviteja| Nayantara | దాసరి చేతుల మీదుగా "ఆంజనేయులు" ఆడియో విడుదల

ఆంజనేయులు ఆడియో
WD
ఇండస్ట్రీని నమ్ముకున్న వారు ఎప్పటికీ చెడిపోరని, అయితే సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాక నిర్లక్ష్యం, అహంకారంతో ప్రవర్తించిన ఎందరో నాశనమయ్యారని దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణ రావు పేర్కొన్నారు.

రవితేజ, నయనతార జంటగా నటించిన "ఆంజనేయులు" చిత్ర ఆడియో వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఆడియో క్యాసెట్‌ను దాసరి విడుదల చేసి మంత్రి బొత్సా సత్యనారాయణకు అందించారు. ఆడియో సీడీని కృష్ణారెడ్డి విడుదల చేసి సురేష్‌బాబుకు అందించారు.

శుక్రవారం రాత్రి తాజ్‌డెక్కన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "యువత" దర్శకుడు చక్కని టేకింగ్‌తో తీశాడన్నారు. రవితేజ చిన్న పాత్రలు చేసి గొప్ప హీరోగా ఎదిగాడు. అలాగే నటునిగా వచ్చి నిర్మాత స్థాయికి ఎదిగిన వ్యక్తి గణేష్ బాబు. అతడు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉంటాడని కితాబిచ్చారు.

ఎవరైనా సరే ఇండస్ట్రీలోనైనా, ఎక్కడైనా అలాగే ఒదిగి ఉండాలి. ఇక్కడ హిట్ కొడితే ఎవరికైనా అహం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలా అహంకారాన్ని అదుపుచేసుకోలేని ఎందరో నాశనమయ్యారని దాసరి వెల్లడించారు. అందరూ ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు తీసే రవితేజను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

రవితేజ మాట్లాడుతూ.. దక్షణాదిలోనే బెస్ట్‌డైరక్టర్‌గా పరశురామ్ నిలుస్తారని చెప్పారు. మళ్ళీ ఆయనతో మరో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రవితేజ ఈ సందర్భంగా ప్రకటించారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. కిక్ తర్వాత మళ్లీ రవితేజ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం "ఆంజనేయులు" రీరికార్డింగ్‌ను జరుపుకుంటున్నాడని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, బ్రహ్మానందం, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సురేష్ బాబు, కె.ఎస్. రామారాలు, సి. కళ్యాణ్, కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. గణేష్ అగ్ర నిర్మాతగా ఎదగాలని ఆకాంక్షించారు.
About Writer
SELVI.M