ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో "శివాజీ" హీరో రజినీకాంత్ "రోబో" చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఇందులో శివాజీ సరసన మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.
కాగా రోబో (తమిళంలో యందిరన్) చిత్రం తర్వాత ఇటీవలే "మగధీర" వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్నారని తెలిసింది.
మెగాస్టార్ చిరుతనయుడు రామ్చరణ్ తేజ నటించిన మగధీర హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉండి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని చూసిన రజినీకాంత్ రాజమౌళిని అభినందించారు కూడా.
ఈ సందర్భంగా రజినీకాంత్తో తాను సినిమా తీయడానికి సిద్ధమని రాజమౌళి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి కోయంబత్తూరులో ఉన్నారు. సునీల్ హీరోగా నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ లొకేషన్ కోసం ఆయన అక్కడికి వెళ్లారు.