తెలుగు ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీర్చిదిద్దిన సుప్రసిద్ధ దర్శకులు కె. వాసు.. తాజాగా మెంటల్ కృష్ణ ఫేమ్ పోసాని కృష్ణమురళితో "తింగరోడు" అనే కొత్త సినిమాను రూపొందించనున్నారు.
గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం సోమవారం (ఆగస్టు31వ తేదీన) ఫిలింఛాంబర్లో లాంఛనంగా ప్రారంభమైంది.
ఫిలింఛాంబర్ సమీపంలో ఉన్న దేవాలయంలో పోసాని, శ్రద్ధాఆర్యలపై తీసిన ముహూర్తపు షాట్కు దర్శకులు కె. వాసు చిత్రీకరించారు. సుప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ కెమేరా స్విచ్ఛాన్ చేసి శుభం పలికితే, నిర్మాతల మండలికి అధ్యక్షులుగా ఎన్నికైన సుప్రసిద్ధ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తొలి క్లాప్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రం షూటింగ్ ముహూర్తోత్సవానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేశారు.
షూటింగ్ ముహూర్తం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకులు కె. వాసు "తింగరోడు" గురించి మాట్లాడుతూ.. కథను సిద్ధం చేసుకున్నాక పోసాని ప్రధాన పాత్రను పోషిస్తే బాగుంటుందని భావించి ఆయనకు కథను వినిపించామన్నారు.
కథను వింటూనే ఇందులో నటించేందుకు పోసాని అంగీకరించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఇందులో ఆయనది పెక్యులర్ తరహాలో సాగే పాత్రని దర్శకుడు వెల్లడించారు. అందుకే దీనికి "తింగరోడు" అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు.
పోసానితో తొలిసారి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్తో పూర్తిచేసి, కొన్ని కీలక సన్నివేశాలను గోవా, ముంబై, కొల్కతాలలో చిత్రీకరిస్తామని వాసు చెప్పారు.
కథానాయకుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. కథానుసారం "తింగరోడు" అనే పేరు కరెక్టుగా సరిపోతుందన్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తీర్చిదిద్దిన సీనియర్ డైరక్టర్ కె.వాసుతో కలిసి తొలిసారి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. కె. వాసు వన్ ఆఫ్ ది లెజెండ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనలో మంచి టీమ్ వర్క్, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయని పోసాని కితాబిచ్చారు.
కథానాయిక శ్రద్ధా ఆర్య మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి సరసన నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. దర్శకులు కె. వాసు తనకు మంచి అవకాశం కల్పించినందుకుగాను ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
పోసాని కృష్ణ మురళి, శ్రద్ధా ఆర్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ ఎర్రం శెట్టి శాయి, మాటలు: దాసరి బ్రహ్మం, కెమెరా: అంజి (C.A.AP), ఎడిటింగ్: కె. రవీంద్రబాబు, కాస్ట్యూమ్స్: కె. నాగరాజు, మేకప్: బాలరాజు, ఆర్ట్స్: వాసు, స్టిల్స్: రమేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: యు.వి. రమణారెడ్డి.