వర్మ "రక్త చరిత్ర" ఎలా తీస్తాడో చూస్తాం: ఫ్యాక్షన్ లీడర్స్
WD
పరిటాల రవి, సూరి వర్గాల మధ్య బుసలుగొట్టిన ఫ్యాక్షన్ తగాదాల యధార్థ గాధను తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు పలు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. తమకు సంబంధించిన సంఘటనలను వక్రీకరించి చూపిస్తే ఊరుకోబోమని అనంతపురం ఫ్యాక్షన్ లీడర్స్ హెచ్చరిస్తున్నారు.
అసలు వర్మ అనంతపురంలో "రక్త చరిత్ర" షూటింగ్ ఎలా చేస్తాడో చూస్తామంటున్నారు. మరోవైపు పరిటాల రవి అర్థాంగి పరిటాల సునీత మాట్లాడుతూ... రక్త చరిత్ర చిత్రాన్ని వర్మ ఫ్యాక్షన్ రాజకీయాలు విడనాడాలనే కోణంలో తీస్తారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాకాక ప్రోత్సహించే విధంగా ఉన్నట్లు తెలిస్తే, తానుకూడా ఆ చిత్ర షూటింగ్ను అడ్డుకుంటానని చెప్పారు.
WD
ఇదిలావుండగా మహిళా సంఘాలు "రక్త చరిత్ర" సినిమాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. హింసాత్మక సంఘటనలతో చిత్రాలను రూపొందించే బదులు... జాతీయ స్ఫూర్తిని నింపే భగత్ సింగ్, గాంధీజీ వంటి మహానాయకులపై తీస్తే మంచిదని హితవు పలికాయి.
ఎవరెన్ని అన్నప్పటికీ తాను "రక్త చరిత్ర" చిత్రాన్ని తెరకెక్కించి తీరుతానని రామ్ గోపాల్ వర్మ తెగేసి చెపుతున్నారు. సినిమాలో చూపించే సంఘటనలను చూసి ప్రజలు పెడదోవ పడతారని తను అనుకోవడం లేదనీ, కేవలం దానిని ఓ రీల్లా చూసి ఎంజాయ్ చేస్తారని వర్మ వాదిస్తున్నారు. మొత్తానికి రక్త చరిత్ర తెరకెక్కక ముందే చరిత్రను సృష్టిస్తోందన్నమాట...