"చిరుత"నయుడు 'రామ్చరణ్ తేజ' హీరోగా నటించిన "మగధీర" సినిమా వందరోజుల వేడుకలకు సిద్ధమవుతోంది. రామ్చరణ్, అందాలతార కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన మగధీర ఘనవిజయాన్ని పురస్కరించుకుని అత్యంత భారీగా వందరోజుల వేడుక చేయాలని నిర్ణయించారు.
అల్లు అరవింద్ కోరికను, చిరు లక్ష్యాన్ని నెరవేర్చిన ఈ సూపర్హిట్ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి టెక్నికల్ వండర్గా తెరకెక్కించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి రూపొందించిన "మగధీర" నవంబర్ మొదటివారంలో వందరోజులకు చేరుకుంటుంది.
ఈ ఘనవిజయాన్ని మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సమక్షంలో భాగ్యనగరం శిల్పకళావేదికలో చేయాలని అల్లు అరవింద్ నిర్ణయించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మగధీరకు భారీ కలెక్షన్లు వస్తున్నాయని తెలిసింది. విడుదలైన వందరోజులు చేరుకుంటున్నా మెగాస్టార్ తనయుడి విన్యాసాలను తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా "మగధీర" ఆడే థియేటర్లు అభిమానులు, ప్రేక్షకులతో నిండిపోతున్నాయని తెలిసింది.