"సీతారాములు"గా నితిన్, హన్సిక కనిపించబోతున్నారు. 'సిద్దూ ఫ్రమ్ శీకాకుళం' ఫేమ్ నిర్మాత వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఓ హోటల్లో జరిగింది. నిర్మాత శ్రేయోభిలాషులు సి. కల్యాణ్, కెఎస్ రామారావు టైటిల్ ఆవిష్కరించారు.
ముందుగా నిర్మాత మాట్లాడుతూ, తాను తీసిన మొదటి సినిమా దర్శకుడినే తన 2వ చిత్రానికి దర్శకుడిగా తీసుకోవడంతో చాలామంది ఆక్షేపించారు. సెంటిమెంట్గా రెండోసారి అదే దర్శకుడికి ఇస్తే సినిమా హిట్ కాదన్నారు. కానీ దాన్ని చెరిపి వేయాలని మళ్లీ ఈ అవకాశాన్ని సిద్దూ ఫ్రమ్ శీకాకుళం దర్శకునికే ఇచ్చానన్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ తీయాల్సి ఉందన్నారు. వచ్చేనెల 18న ఆడియోను, డిశెంబరు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ, అలనాటి రాముడు భార్యకోసం లంకకు వెళ్లి తిరిగి వస్తే, ఈ రాముడు తన ప్రేయసికోసం లంక వెళ్లి ఏం చేశాడు? అన్నది కథ అని చెప్పారు. నితిన్ మాట్లాడుతూ... "క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నాకు తగిన పాత్ర. చాలా ఇష్టపడి చేశాను" అన్నారు. హన్సిక మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందనే నమ్మకముందనీ, చక్కటి నిర్మాణ సంస్థలో చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
సుమన్ మాట్లాడుతూ.. వైజాగ్లో మార్షల్ ఆర్ట్స్ కాంటెస్ట్లో పరిచయమైన విజయకుమార్గారు నిర్మాత స్థాయికి ఎదిగారు. నేను ఈ చిత్రంలో కొత్త గెటప్లో కనబడతాను అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో అలీ,ఎంఎస్, వేణు మాధవ్, చంద్రమోహన్ తదితరులు నటించారు. కథ: విక్రమ్ రాజ్, ముకుంద్ పాండే, మాటలు: తోట ప్రసాద్, విక్రమ్ రాజ్, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఈశ్వర్