క్రేజీ హీరో అల్లు అర్జున్, 'మగధీర' కథానాయిక కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "ఆర్య-2" ఆడియో నవంబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ఆదిత్యబాబు, బోగవల్లి ప్రసాద్లు వెల్లడించారు. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది ఆర్యకు కొనసాగింపు కాదని స్పష్టం చేశారు. కాకపోతే అదే స్టైల్లో ఉంటుందని చెప్పారు. సరికొత్త కథాంశంతో రూపొందే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇదని ఆయన తెలిపారు. అల్లు అర్జున్, కాజల్లు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారని సుకుమార్ అన్నారు.
ఇందులో నవదీప్, శ్రద్ధాదాస్ కూడా మరోముఖ్య పాత్రలు పోషిస్తున్నారని దర్శకుడు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ చివరిదశలో ఉందని, నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సుకుమార్ అన్నారు.