ప్రముఖ ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ తాజాగా డా.డి. రామానాయుడు మనుమడు రాణాను కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. "లీడర్" అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో ఏవీఎం 174వ చిత్రాన్ని నిర్మించనుంది.
ఈ చిత్రానికి "హ్యాపీడేస్" ఫేమ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకు కథానాయకుని స్టిల్స్ రిలీజ్ చేయలేదు. వెరైటీగా మొహం సరిగ్గా కన్పించకుండా అంతా బ్లాక్లో ఉండేవిధంగా హీరో పోస్టర్లను గురువారం రాత్రి విడుదల చేశారు.
ఈ నెలాఖరున జరిగే ఆడియో వేడుకలో సినిమా స్టిల్స్ను విడుదల చేస్తామని, ఇదొక కొత్త ప్రయోగమని దర్శకుడు చెప్పారు. డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నట్లు శేఖర్ కమ్ముల చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కూడా రామానాయుడు స్టూడియోలో రాణా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.
రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కోట, సుహాసిని, హర్షవర్ధన్, భరణి, రావురమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.