టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ హీరోల ఆధిపత్య పోరు ఆరంభమైంది. నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ను ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లు హవా కొనసాగింది. ఇపుడు వీరి ప్రభంజాన్ని జూనియర్ మెగాస్టార్ అడ్డుకున్నారు. తాను నటించిన రెండో చిత్రం "మగధీర"తోనే ఒక్క తెలుగు చిత్రసీమలోనే కాకుండా, దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. దీంతో ఇపుడ టాలీవుడ్లో అగ్రహీరోల జాబితాలో రామ్చరణ్ తేజ్ అగ్రస్థానానికి చేరారు.
జూలై 31వ తేదీన విడుదలైన "మగధీర" చిత్రం ఈనెల ఏడో తేదీ (శనివారం)తో వంద రోజులు పూర్తి చేసుకుంది. 223 సెంటర్లలో ఈ చిత్రం విజయవతంగా హౌస్ఫుల్ కలెక్షన్లతో సెంచరీ కొట్టింది. గతంలో మహేష్ బాబు నటించిన "పోకిరి" చిత్రం 40 కోట్ల రూపాయలు వసూలు చేయగా, 200 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.
అయితే, "మగధీర" చిత్రం మాత్రం "పోకిరి" చిత్రాన్ని మించి పోయింది. 223 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించడమే కాకుండా, కేవలం 75 రోజుల్లో 80 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించి పెట్టింది. వంద రోజుల్లో ఈ ఆదాయం కనీసం 90 నుంచి 100 కోట్లకు చేరుకుని ఉంటుందని ఫిల్మ్ నగర్ వాసుల అంచనా. అయితే నిర్మాత మాత్రం దీనిపై ఎక్కడా నోరు విప్పడం లేదు.
అంతేకాకుండా 301 థియేటర్లలో అర్థ శతదినోత్సవం జరుపుకోవడం కూడా మరో రికార్డు కావడం గమనార్హం. వరద బాధితుల కోసం ఆర్థిక సాయం చేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టార్ నైట్ నిర్వహించే రోజునే "మగధీర" చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోవడం గమనార్హం.