International Children Film Festival, Ileana, Trisha, Revathi Menon, Geeta Reddy, Nandita Das, Venkatesh, Nagarjuna, Tarun | బాలల చిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: గీతారెడ్డి
చిత్రోత్సవాలకు వెంకీ, నాగార్జున, ఇలియానా, త్రిష హాజరు
WD
గురువారం గోల్కొండ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో గీతారెడ్డి ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ.. గుల్జార్, విశాల్ భరద్వాజ్, వెంకటేష్, నాగార్జున, తరుణ్, తారే జమీన్ పర్ ఫేమ్ దర్ఘీర్, ఇలియానా, త్రిష, రేవతి మీనన్, శాంతా సిన్హా, ఆశిష్ విద్యార్థి వంటి ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 14వ తేదీ సాయంత్రం లలితకళాతోరణంలో ప్రారంభోత్సవం జరుగుతుందని గీతారెడ్డి అన్నారు. వివిధ దేశాలకు చెందిన బాలల డెలిగేట్లకు తాజ్మహల్ హోటల్ ఆశ్రయం ఇస్తుందన్నారు. మిగిలిన డెలిగేట్లు తాజ్ డెక్కన్, గోల్కొండ హోటళ్లలో ఉంటారని ఆమె తెలియజేశారు.
19న 3డి సినిమా:
ప్రసాద్ ఐమాక్స్లోని మూడు స్క్రీన్లతో పాటు ఉషామయూరి, శశికళ థియేటర్లతో పాటు మొత్తం 8 థియేటర్లలో చిత్రాలను ప్రదర్శిస్తారు. 19వ తేదీన పిల్లలకు ప్రత్యేకంగా "ఫ్లయి నీడ్ టు మూన్" అనే చిత్రాన్ని ప్రదర్శిస్తామని గీతారెడ్డి చెప్పారు. అదేవిధంగా బాలలను చైతన్యపరిచేందుకు ఈ నెల 13న నెక్లెస్రోడ్లోని పీపుల్ ప్లాజా నుండి లుంబినీ పార్క్ వరకు 2కె రన్ను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఫిలిమ్ సొసైటీ ఛైర్పర్సన్ నందితాదాస్ మాట్లాడుతూ.. 20 దేశాలకు చెందిన 70 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడతాయని, తాను మూడు నెలల క్రితమే ఈ బాధ్యత తీసుకున్నానని చెప్పారు. పిల్లలను చైతన్యపరిచేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయని ఆమె అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యునిసెఫ్ ప్రతినిధి నరేన్ తదితరులు పాల్గొన్నారు.