Telangana| Andhra Pradesh| Cinema| Saleem| Katha| Vaade Kavali | సినీ ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభావం: "సలీమ్" రిలీజ్ వాయిదా
తెలంగాణ వివాదం ఆంధ్రదేశానికి పాకింది. కోస్తా, రాయలసీమల్లోనూ ప్రకంపనలను సృష్టిస్తోంది. పార్టీలతో సంబంధాలు లేకుండా ఎమ్మేల్యేలు, ఎంపీలు రాజీనామా పరంపరలు కొనసాగించడంతో కడప, విజయవాడ, కర్నూలులో ఈ నెల 11న బంద్కు వివిధ పక్షాలు పిలుపునిచ్చాయి. 12వ తేదీన వైజాగ్ తదితర ప్రాంతాలు బంద్కు పిలుపునివ్వడంతో ఇటు సినిమాలపై ప్రభావం పడింది.
ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉన్న దృష్ట్యా "సలీమ్" చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మంచు మోహన్బాబు గురువారంనాడు ప్రకటన చేశారు. ఏడాదికి పైగా భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రానికి రిలయన్స్కు చెందిన బిగ్ బి సంస్థ నిర్మాణంలో పాలు పంచుకుంది. వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో విష్ణు, ఇలియానా జంటగా నటించారు.
ఇందులో విశేషమేమిటంటే..? సలీంకు ఓవర్సీస్ మార్కెట్ వున్న దృష్ట్యా ఇప్పటికే అక్కడికి ప్రింట్లు వెళ్ళిపోవడంతో న్యూజెర్సీ, వర్జీనియా, అట్లాంటా, డెట్రాయిడ్, లాస్ఏంజెల్స్, సాన్హోసె, హోస్టన్లలో ఆంధ్రకంటే ముందే విడుదల కావడం.
ఇక ఈ నెల 12న గుణ్ణం గంగరాజు నిర్మించి, జెనీలియా, ఆదిత్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కథ" సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 12వ తేదీ ఆంధ్రలోని కొన్ని చోట్ల బంద్ జరుగనుండటంతో "కథ" రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
ఈ విషయమై చిత్ర నిర్మాత గురువారం మాట్లాడుతూ.. "కథ" సినిమా విడుదలపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని, రేపటి పరిస్థితిని బట్టి చిత్రాన్ని విడుదల చేస్తామని తెలియజేశారు.
