ఛార్మింగ్ గాళ్ ఛార్మి ప్రధాన పాత్రలో ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఆర్ కె. పవన్ దర్శకత్వంలో నల్లూరి రాజశేఖర్ నిర్మిస్తున్న "సై ఆట" చిత్రం ఒక పాట మినహా నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రీ రికార్డింగ్ జరుపుతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నల్లూరి సుధారాణి, రాజశేఖర్ మాట్లాడుతూ.. సరికొత్త కథ కథనాలతో ఛార్మిని కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇదన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు.
పాటలన్నీ కథలో భాగంగా ఉన్నాయని, కథకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, పాటలకు అంతే ప్రాధాన్యత ఉంటుందని నిర్మాతలు వెల్లడించారు. త్వరలో ఆడియోను ఆవిష్కరించి, ఫిబ్రవరి నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
హీరోయిన్ ఛార్మి మాట్లాడుతూ.. నా కెరీర్లో సై ఆట చెప్పుకోదగిన సినిమా అవుతుందన్న నమ్మకముంది. అనుకోకుండా ఒకరోజు, మంత్రలాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయో, వాటిని మించి అలరించే విధంగా సై ఆట ఉంటుంది. దర్శకులు పవన్ డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. రాజశేఖర్ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు" అని తెలిపారు.