నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన "ఏ మాయ చేసావె" చిత్రం సక్సెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఉమెన్స్ డే నాడు జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల మాట్లాడుతూ... నాన్నగారు ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రెండు కుటుంబాలు కలిసి తీసిన ఈ చిత్రం పోకిరి అంత హిట్ అవుతుందని చెప్పారు. చైతన్య మా ఇంటి హీరో. టాలెంట్ ఉంది. లవ్ స్టోరీని దర్శకుడు గౌతమ్ మీనన్ చక్కగా చూపించారని చెప్పారు.
అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణగారి అమ్మాయి మంజుల నా దగ్గరకు వచ్చి అంకుల్ ఒక కావ్యంలాంటి సినిమా చేస్తున్నాను అని చెప్పారు. సీనియర్ నటుడిగా నిర్మాత కష్టాలు తెలుసు కాబట్టి జాగ్రత్త అని చెప్పాను. సెక్స్, హింస రాజ్యమేలుతున్న ఈ సమయంలో చిన్న కథను తీసుకుని చెడు లేకుండా చక్కగా తీశారు.
పెడ ధోరణి పడుతున్న సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా ఈ చిత్రం నిలుస్తుంది. నా మనవడి పాత్రలో కష్టం లేదు. నేనూ గతంలో లైలా మజ్ను, దేవదాసు వంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలు చేశాను. వాటిల్లో హీరోయిన్ పాత్రే చాలా కష్టపడాలి. అలాంటి కష్టం సమంత పడింది. ఆమె ఫేస్లో హావభావాలు చక్కగా పలికాయి. మనవడిలో లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే మంచి నటుడవుతాడని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమా చూడగానే గీతాంజలిలా ఉంటుందని చెప్పాను. ఈ కథానాయక జెస్సీకోసం మూడుసార్లు సినిమా చూశాను. చిత్ర యూనిట్ అంతా వస్తే బాగుండేది. దర్శకుడు, సంగీత దర్శకుడు అందుబాటులో లేరు. ఇది టెక్నీషియన్ మూవీ. నా అభిమానులు కూడా ఇందులో ఫైట్స్ లేవు అనకుండా సినిమాను ఆదరించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ... విడుదలకు ముందే సినిమా చూశాను. మొదట్లో భయమేసింది. ముందు సినిమాకంటే కొత్తగా ఉంది. ఈ రోజు ఇంతమంది ఆదరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సమంత, సంజయ్ కపూర్, సుమంత్, శ్రీను వైట్ల తదితరులు పాల్గొన్నారు.