1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rakta Charitra

Ram Gopal Varma | Rakta Charitra | Political Industry | ప్రజాసేవ చేసేవారు "దేహీ" అని అడుక్కోవడమెందుకు..?: వర్మ

రామ్ గోపాల్ వర్మ
అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "రక్త చరిత్ర-1" విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదిలావుంటే రక్తచరిత్ర తర్వాత తాను "పొలిటికల్ ఇండస్ట్రీ" పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ చిత్రం కుళ్లు రాజకీయాలను ఎండగడుతుందా... లేదంటే రాజకీయాల్లో అవినీతిపై బాణం ఎక్కుపెడుతుందా అని అడిగిన ప్రశ్నకు వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

అసలు ప్రజలకు సేవ చేయాలనే నాయకులు ఓట్లకోసం దేహీ అని ప్రజలను అడుక్కోవడం ఎందుకో తనకు అర్థం కాని ప్రశ్న అని అన్నారు. ఈ ప్రశ్నను ఆధారం చేసుకుని తన పొలిటికల్ ఇండస్ట్రీ ఉంటుందని చెప్పారు.

ప్రజాసేవ చేయదలుచుకున్నవారు తన ప్రొఫైల్‌ను ప్రజల ముందు ఉంచి సేవ చేయదలచుకున్నానని ఓ ప్రకటన ఇస్తే సరిపోతుందనీ, అలా కాకుండా అనేకమైన పద్ధతుల ద్వారా ప్రజలను బుట్టలో వేసుకునేందుకు నాయకులు ప్రయత్నించడాన్ని చూసినప్పుడు చిత్రంగా ఉంటుందన్నారు వర్మ.
WD


ఇక తాను రూపొందిస్తున్న రక్త చరిత్ర కేవలం అనంతపురంలోని ప్రజలు, అక్కడి పోలీసు అధికారులు ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని తన మదిలో ఏర్పరుచుకున్న కోణాలు మాత్రమే ఆవిష్కృతం చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఈ చిత్రంలో ఒక పార్టీకి చెందిన వ్యక్తులను తక్కువగా చూపించి మరో పార్టీకి చెందిన వ్యక్తులను ఎక్కువగా చూపించాల్సిన అగత్యం తనకు పట్టలేదని తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT