Tollywood Trophy | T20 | Chiru Cheetas | Balayya Lions | Nag Kings | Venky warriors | చిరు చీతాస్-బాలయ్య లైన్స్-నాగ్ కింగ్స్-వెంకీ వారియర్స్
WD
"మా" అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమ, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్ అసోసియేషన్, ఫెడరేషన్... ఇలా అందరి సహకారంతో ఈ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించనున్నాం. మొత్తం నాలుగు టీమ్ల మధ్య జరిగే ఈ మ్యాచ్లో ఏ టీమ్లో ఎవరు ఆడనున్నారు అనే విషయాన్ని ఈ నెల 27న జయభేరి క్లబ్లో లక్కీ డ్రా పద్ధతి ద్వారా మీడియా సమక్షంలో తెలియజేయనున్నాము.
దాదాపు వందమంది యంగ్స్టర్స్ ఈ మ్యాచ్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపారు. వారందరి నుంచి టీమ్కి 15 మంది చొప్పున 60మందిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే జూన్ 6న యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో డ్రెస్ లాంచింగ్ కార్యక్రమంలో నలుగురు టీమ్ లీడర్స్, మెంబర్స్ ఆయా డ్రెస్లతో ఫ్యాషన్ పెరేడ్లో పాల్గొంటారు. ఈ మ్యాచ్లో ఒక్కో టీమ్కు ఇద్దరేసి నాయికల చొప్పున టీమ్ అంబాసిడర్స్ ఉంటారు.
జూన్ 13న జరిగే మ్యాచ్ను తొలుత యాంటీ పైరసీ రన్తో ఆరంభిస్తాము. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆయా టీమ్ల మధ్య ఈ మ్యాచ్లను నిర్వహిస్తాము. మధ్యలో నటీనటులతో కూడిన సాంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తాము. ఈ మ్యాచ్ను తిలకించేందుకు జనరల్ ఆడియన్స్కు రూ.200 చొప్పున వి.ఐ.పి పాసులకు రూ.10,000( ఎవరు ముందు సంప్రదిస్తే వారికి) చొప్పున టిక్కెట్లు ఉంటాయి. ఈ మ్యాచ్పై వచ్చే ఆదాయాన్ని చేనేత కార్మికులకు, పేద విద్యార్థులకు సహాయమందించనున్నాం.
ముఖ్యమంత్రి కె.రోశయ్య, అక్కినేని నాగేశ్వరరావు, దాసరి, కేంద్రమంత్రి గీతారెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ కార్తికా రెడ్డి, ముఖేష్ గౌడ్ తదితరులు అతిథులుగా హాజరవుతారు. జెమిని, తేజ టీవీలలో ఈ కార్యక్రమం టెలీకాస్ట్ అవుతుంది. రెక్సోనా కంపెనీవారు కప్ను అందిస్తారని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచ్లను తలపించేలా జరిగే ఈ మ్యాచ్ 24 కెమెరాలతో చిత్రీకరించబడుతుందని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో శ్రీకాంత్, బ్రహ్మాజీ, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.