మెగాస్టార్ చిరంజీవి నటించే కొత్త చిత్రం ఈనెలలో ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే 148 చిత్రాలు పూర్తి చేసుకున్న చిరంజీవి తాజాగా 149వ చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు చేస్తారనే అనే విషయం తేలాల్సింది. ఈ చిత్రానికి "అధినాయకుడు" అనే పేరును ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ చిత్రం కథ కూడా అదే తరహాలో సాగుతుందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం సీనియర్ రచయితలైన పరుచూరి బ్రదర్స్ ఐదు కథలు సిద్ధం చేశారని, ఇందులో ఒకదాన్ని మెగాస్టార్ ఖాయం చేయవచ్చని తెలుస్తోంది. ఇదివరకు ప్రచారంలోకి వచ్చినట్లు రాయలసీమ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కాకుండా, నేటి రాజకీయ, సామాజిక వాతావరణంలో నడిచే కథనే చిరంజీవిని ఎంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం మాత్రం గోప్యంగా ఉంది. యువనటుడు విష్ణుతో కృష్ణవంశీ, జూనియర్ ఎన్టీఆర్తో వినాయక్ సినిమాలు ఖాయం కావడంతో సంచలనాల దర్శకుడు ఎన్.శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించవచ్చని ఇటు ఫిల్మ్ నగర్, అటు కోడంబాక్కం వర్గాల సమాచారం.
|