చిత్ర పరిశ్రమకు చెందిన వారిని పెళ్లి చేసుకోబోనని హీరోయిన్ సాక్షి శివానంద్ స్పష్టం చేసింది. అయితే తన పెళ్లికి మరో రెండేళ్లు ఆగాల్సిందేనని ఈ భామ తేల్చి చెప్పింది. జ్యువెలరీ డిజైనింగ్ కోర్సు చేశానని, అందువల్ల ఈ రంగానికి చెందిన వారినే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సాక్షి శివానంద్ సూచన ప్రాయంగా వెల్లడించింది. జగపతి బాబు, జేడి.చక్రవర్తిలు హీరోలుగా నటిస్తున్న "హోమం" చిత్రంలో సాక్షి ఒక ఐటం సాంగ్ చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన చాలా రోజుల తర్వాత 'హోమం' చిత్రంలో ఈ అవకాశం దక్కింది.
ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ మీడియాతో మాట్లాడుతూ.. హీరోలు జగపతి, చక్రవర్తిలపై ఉన్న మంచి భావనతోనే తాను ఐటం సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టు చెప్పింది. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న వారిలో 95 శాతం మంచివారు కాదని, కేవలం ఐదు శాతం మంది మాత్రమే సత్ప్రవర్తన కలిగి ఉంటారని సాక్షి శివానంద్ అభిప్రాయపడింది. ఈ భామ లోగడ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన "సింహరాశి" చిత్రంలో చివరి సారి నటించింది. ఆ తర్వాత సాక్షికి తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడంతో తెలుగు వెండితెరకు దూరమైంది.
|