సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రోబో' చిత్రం నుంచి ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యారాయ్ తప్పుకున్నట్టు కోడంబాక్కం వర్గాల తాజా సమాచారం. రజనీ-శంకర్ కాంబినేషన్లో 'రోబో' చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందే ఈ ప్రాజెక్టులో ఐశ్వర్యారాయ్కు నాలుగున్నర కోట్ల రూపాయల పారితోషకాన్ని అందజేసేందుకు దర్శకుడు శంకర్ అంగీకరించారు.
అయితే ఆమె క్యాల్షీట్లు వచ్చే ఏడాదికి కేటాయించారు. ఇది కుదరదని తేల్చి చెప్పిన శంకర్ వేరే హీరోయిన్ కోసం గాలించ సాగారు. దీంతో ఒకింత నిరాశకు లోనైన రజనీకాంత్, ఐష్ స్థానంలో 'శివాజీ' భామ శ్రియను ఎంపిక చేయాల్సిందిగా సలహా ఇచ్చినట్టు సమాచారం.
ఐశ్వర్యారాయ్తో కలసి నటించాలని 'బాబా' ఎప్పటి నుంచో కలలు కంటున్న విషయం తెల్సిందే. ఈ కల 'రోబో'తో నెరవేరుతుందని భారత చిత్ర పరిశ్రమ భావించింది. అయితే ఐష్ క్యాల్షీట్ల సమస్య కారణంగా 'బాబా' ఆశ నెరవేరకుండా మిగిలిపోనున్నాయి.
|