వేసవిలో విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న 'జల్సా' చిత్రం తర్వాత హీరో పవన్ కళ్యాణ్ చేయనున్న చిత్రం 'పులి'. ఈ చిత్రం షూటింగ్లో కొంత జాప్యం నెలకొంది. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో రూపొందనున్న 'పులి' చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. అయితే... హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశంలో హీరో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాలని ఆరాటపడుతున్నట్టు సమాచారం.
అందువల్ల 'పులి' చిత్రం షూటింగ్ను కొద్దిరోజుల పాటు వాయిదా వేసినట్టు సమాచారం. ఈ కారణాల రీత్యా షూటింగ్కు ఎక్కువ రోజుల సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయించలేక పోతున్నారని, అందువల్ల చిత్రాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వచ్చే 2009లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి చిరంజీవి రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏర్పాటు కానున్నట్టు బలమైన ఊహాగానాలు వస్తున్న విషయం తెల్సిందే. కాగా, ఇటీవల విడుదలైన 'జల్సా' చిత్రం అటు ప్రేక్షులను ఆనందపరచడమే కాకుండా.. రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.