హాన్సికా మొత్వానీ.. రుచి... అభిరుచి
పదహారేళ్ళ వయస్సులోనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన పండంటి పడుచుపిల్ల హాన్సికా మొత్వానీ. 'కోయి మిల్గయా' అనే చిత్రంలో బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగు వెండితెర ఆహ్వానం పలికింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' చిత్రంలో తెలుగు వెండితెరపై తళుక్కుమంది. మూడో చిత్రం 'ఆప్కా సురూర్' చిత్రం కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ భామ వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకుందామా?
కేంబ్రిడ్జికి చెందిన స్కూల్లో ఏ లెవెల్స్ చేస్తున్న ఈ భామకు పదహారేళ్ళ వయస్సులోనే హీరోయిన్గా అదృష్ట దేవత తలుపుతట్టడం మరచిపోలేని సంఘటనగా చెప్పుకుంటోంది. ఈ జీవితంతో సహా.. అన్ని దేవుడే ఇచ్చాడనీ ముద్దుగుమ్మ విశ్వాసం. బాలీవుడ్ నటుడు గోవిందాను తాను బాలనటిగా ఉన్నపుడు ఒకసారి ఎక్కడో చూసిందట. ఆయన నటన, కష్టపడేతత్వం చూశానని, అవే తనకు మంచి స్ఫూర్తి నిచ్చాయని ఢంకాబజాయించి చెపుతోంది.
అంతేకాండీ.. తనలో ప్లస్, మైనస్ పాయింట్లను కూడా హాన్సికా నిక్కచ్చిగా చెపుతోంది. తన నవ్వే తనకు ప్లస్ పాయింట్ అట. ఇక మైనస్ పాయింట్కు వస్తే.. చిన్నవిషయానికి కూడా విసుగు చెందే స్వభావం ఉందని చెపుతోంది. ఉత్తరభారతంలో పుట్టి పెరిగినప్పటికీ.. ఇడ్లీతో సహా దక్షిణాది వంటకాలు చాలా ఇష్టంగా ఆరగిస్తానని చెప్పుకొచ్చారు. చివరిగా.. తన ఫిలాసఫీని ఏమిటని అడిగితే... ఈ లోకంలో డబ్బుకున్నా, విలువైనది కాలం.. అందుకే దాన్ని వృథా చేయకుండా నడుచుకోవడమే జీవిత ధన్యమని హాన్సికా మొత్వానీ అంటోంది.