టాలీవుడ్ ప్రిన్స్, నటుడు మహేష్బాబు ఈ మధ్య ప్రతి విషయానికి మండిపడుతున్నారు. మీడియాలో తనపై రకరకాలుగా వస్తున్న వార్తలకు ఆయన చిరాకుపడుతున్నారు. ఇటీవల తన సోదరి మంజుల నిర్మించిన కావ్యాస్డైరీ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడారు.
కావ్యాస్ డైరీలో మంజుల బాగా నటించిందని చెబుతూ.. తన వ్యక్తిగత జీవితంపై పలు రకరకాలుగా వస్తున్న కథనాలు అవాస్తవాలని చెబుతున్నారు. మీడియా ఏది పడితే అది రాస్తోందని మండిపడ్డారు. తానూ మనిషేనని, తనకంటూ పలు బాధ్యతలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.
"సినిమాలు తీస్తూ కాస్త బ్రేక్ తీసుకుంటే ఎందుకు గ్యాప్ వచ్చిందని, ఇంతలో ఎవరో తనను కిడ్నాప్ చేశారని, తన భార్య విడాకులు ఇవ్వబోతుందని.." ఇలా రకరకాలుగా వార్తలు రావడం పట్ల తీవ్ర పరుష పదజాలంతో మహేష్ బాబు తిట్టిపోశారు. ఒకానొక దశలో అసలు మీడియా ఎక్కువై.. ఒక దానిపై ఒకటి పోటీపడి ఇలా రాస్తున్నాయని దుమ్మెత్తిపోశారు.
ఇక నుంచి తనకు మీడియా అవసరం లేదని, ఏవో రెండు, మూడు పత్రికల వారికే అందుబాటులో ఉంటానని చెప్పడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణ కొడుకుగా నటుడిగా ముందుకు వచ్చినప్పుడు మీడియాను విపరీతంగా ఉపయోగించుకున్న మహేష్ బాబు తన ఫ్యామిలీలో వచ్చిన గొడవల కారణంగా ఇలా మీడియాపై పడడం ఏ మాత్రం సమంజసంగా లేదని అక్కడి వారు సర్ది చెప్పడంతో.. మహేష్ బాబు కాస్త స్థిమితపడి.. ఇది అందరినీ ఉద్దేశించి కాదని చెప్పి, వెంటనే లోపలికి వెళ్ళిపోవడం విశేషం.
ఇదిలా ఉండగా, మహేష్ బాబు తాజా చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ అనే ఫైనాన్షియర్ నిర్మిస్తున్నారు. ఆ చిత్రం బడ్జెట్ పెరిగిపోవడం, మూడుకోట్ల రూపాయలతో వేసిన సెట్లో అనుకున్న విధంగా షూటింగ్ చేయకపోవడం, ఓ దశలో అది అవసరం లేదని మహేష్ బాబు చెప్పడంతో నిర్మాత ఖంగుతిని ఈ చిత్ర నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారట.
ఈ విషయం తెలిసి, అవసరమైతే తానే ఈ చిత్రాన్ని స్వాధీనం చేసుకుంటానని మహేష్ బాబు అన్నట్లు ఫిలింనగర్ వర్గాలు షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ మధ్య మహేష్ బాబు మైండ్ అప్సెట్లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.