Trisha| Bollywood| Akshay Kumar,| Priyadarshan | అక్షయ్ కుమార్తో జతకట్టనున్న త్రిష..!
టాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాల్లో అగ్రహీరోయిన్గా ముద్రవేసుకున్న సొట్ట బుగ్గల చిన్నది, పొడవుకాళ్ల సుందరి త్రిష.. బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్తో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రంలో త్రిష కథానాయికగా నటించబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆకాశమంత వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన త్రిషకు ఈ మధ్య అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తాజాగా వెంకీతో మరోసారి జతకట్టేందుకు త్రిష ఓకే చెప్పిందని తెలిసింది.
ఈ నేపథ్యంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లో తన అందచందాలను ఆరబోసిన త్రిష, తాజాగా బాలీవుడ్ ఛాన్సును కొట్టేసింది. ప్రముఖ ప్రియదర్శన్ దర్శకత్వం వహించే "కఠా మిఠా" అనే హిందీ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించబోతోంది. అక్షయ్ కుమార్ సొంత బేనర్పై, స్వీయ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లో త్రిష ఇప్పటికే సంతకాలు చేసేసిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ విషయమై త్రిష మాట్లాడుతూ.. బాలీవుడ్లో నటించాలన్న తన కల నెరవేరిందని చెప్పింది. అక్షయ్ కుమార్ సరసన నటించే ఈ చిత్రానికి ప్రియదర్శన్ నిర్మాణ సారథ్యం వహించడం హ్యాపీగా ఉందని త్రిష వెల్లడించింది.
తనను ఏడేళ్ల క్రితం "లేసా లేసా" అనే తమిళ చిత్రం ద్వారా తెరపైకి తెచ్చిన ప్రియదర్శన్ నిర్మాణ సారథ్యం వహించే ఈ హిందీ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని త్రిష చెప్పింది. ఇంకా అక్షయ్ కొత్త చిత్రంలో అద్భుతంగా నటించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని త్రిష తెలిపింది.
ప్రియదర్శన్, అక్షయ్ కుమార్లు మాట్లాడుతూ.. దక్షిణాది సినిమాల్లో త్రిష నటనాతీరును చూశాకే ఆమెను తమ కొత్త చిత్రానికి ఎంపిక చేశామన్నారు. ఆకాశమంత సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఇంప్రెజ్ చేసిన తరహాలోనే, తమల్ని కూడా మెప్పించిందని వారు చెప్పారు. దీంతో తమ సినిమాకు కొత్త హీరోయిన్గా త్రిషను సెలక్ట్ చేశామన్నారు.
