Mohan babu, cinema, raju maharaju, producer, director, film nagar, vamsi, | పెదరాయుడి "శ్రీరంగ" నీతులు...!
|
ఆయన పేరు కుమార స్వామి పత్తికొండ. ఈయన తెలుగు చిత్ర సీమలో ఓ చిన్నపాటి నిర్మాత. గతంలో 'వంశం' అనే చిత్రాన్ని నిర్మించారు. సుదీర్ఘ కాలం తర్వాత 'రాజు-మహరాజు' అనే చిత్రాన్ని తీశారు. మోహన్బాబు, శర్వానంద్లు అన్నదమ్ములుగా ఇందులో నంటించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. విడుదలైన మూడు రోజుల్లోనే 60 శాతం కలెక్షన్లు సాధించింది.
అయితే, చిత్రానికి ప్రమోషన్ కల్పిస్తే.. మరింతగా వసూళ్లు రాబట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని నిర్మాతకు స్నేహితులు, సన్నిహితులు సూచించారు. వారి సలహా మేరకు.. చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికి మోహన్ బాబు కూడా వస్తే మరింత ప్లస్ అవుతుందని భావించారు. వెంటనే నిర్మాత.. హీరో కమ్ విలన్గారిని సంప్రదించేందుకు నిర్ణయించుకున్నారు. రోజులు గడిచి పోతున్నాయిగానీ, హీరోగారి దర్శనం కావడంలేదు.
ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన మోహన్ బాబు.. దర్శనం కోసం ఆయన ఇంటి చుట్టు నిర్మాత చెప్పులరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదు. అయ్యగారు... నిద్రపోతున్నారని, ఇపుడే స్నానానికి వెళ్లారని, హీరోగారు ఫోన్లో ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారని ఇలా.. సినిమా ఇళ్లలోనివాళ్లు తమదైన శైలిలో సమాధానాలు చెపుతూ వచ్చారు.
ఇలా రెండు రోజులు గడిచి పోయాయి. అయితే, నిర్మాత మాత్రం అపర భగీరథుడిలా.. మూడోరోజు అంటే.. ఆదివారం మళ్ళీ మోహన్బాబు ఇంటికి వెళ్ళారు. బాబుగారు టిఫిన్ చేస్తున్నారని, వెయిట్ చేయమని చెప్పారు. అలా.. ఒక పూట కూర్చోపెట్టారు. మధ్యాహ్నం అయ్యింది. దీంతో నిర్మాత విసిగి పోయి.. ఇంటికి పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు.
అపుడు... అనుకోకుండా ప్రముఖ వ్యక్తి కోసం ఆయన బయటకురావడంతో నిర్మాత కుమారస్వామిని చూశారు. అరే.. మీరేంటి ఇక్కడ ఉన్నారంటూ ఆశ్చర్యంగా పలుకరించారు. అసలు మీరు వచ్చినట్టు చెప్పనేలేదంటూ.. ఇంటి పనిమనుషులపై మోహన్ బాబు చిందులేశారట. అయ్యగారు ఆగ్రహంతో ఊగిపోవడంతో అంతా కిమ్మనకుండా ఉండిపోయారు.
మీవల్లే నాకు చెడ్డ పేరు వస్తోందటూ.. వాపోతూ, కుమారస్వామి ఎదుటే మందలించారట. ఎట్టకేలకు కోపాన్ని ఆపుకున్న హీరోగారు.. రేపు కనిపించడి. ప్రమోషన్ గురించి చర్చించుకుందామంటూ.. నిర్మాతకు సెలవిచ్చారు. అదే పదివేలుగా భావించిన నిర్మాత బయటకు వచ్చారు. రేపు ఏం అంటాడో అని కుమారస్వామి బెంగ పెట్టుకుని ఉన్నారు.
కేవలం తనను ఏడిపించడం ఇపుడే కాదనీ.. షూటింగ్లు, ఇంటర్వ్యూల టైమ్లోనూ ఇలాగే ఏడిపించారని ఆయన సన్నిహితుల ముందు పత్తికొండ వాపోయారు. కేవలం మోహన్బాబు నటిస్తేనే పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శకుడు చెబితేనే ఆయన్ను ఎంపిక చేశామని, అంతేకాకుండా, బాబు డిమాండ్ చేసినట్టుగా మూడు కోట్ల రూపాయలు చెల్లించామని నిర్మాత వాపోయారు.
రూ.3 కోట్లు అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇది పచ్చినిజం.. అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. "చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మరొకటి" అనే చందంగా.. మోహన్బాబు తీరు ఉంటుందని ఆయన గురించి బాగా తెలిసినవారు కథలుగా చెప్పుకుంటుంటారట.
