ప్రియాంకా చోప్రా ఉన్నట్లుండి తన పారితోషికాన్ని ఆకాశమే హద్దన్నట్లు ఏకంగా రూ. 5 కోట్లకు పెంచిందట. దాంతో చిర్రెత్తిన నిర్మాతలు ఆమెకు సినీ అవకాశాలను ఇవ్వడం మానేద్దామని మూకుమ్మడిగా అనుకున్నారట. ఏదో ఒక్క సినిమా హిట్టయితే చాలు, తలపై కొమ్ములు మొలుస్తాయని బహిరంగంగానే తిట్ల దండకం ఎత్తుకుంటున్నారట.
ప్రియాంక తన రేటును ఇంత భారీగా పెంచేయడానికి గల కారణం మాత్రం యాష్రాజ్ ఫిలిమ్ అని చెపుతున్నారు బాలీవుడ్ సినీజనం. ఈ సినిమాకు ప్రియాంక మూడు కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుందట. ఇదే ఊపుతో తనతో సినిమాలు తీసేందుకు వచ్చిన నిర్మాతల వద్ద తలా ఒక రేటు చెప్పి బెంబేలెత్తించిందట. అయితే ఈ అంకెలన్నీ రూ.5 కోట్లకు పైనే ఉన్నాయని బాలీవుడ్ భోగట్టా.
అసలే ఆర్థికమాంద్యంతో అల్లాడుతుంటే... ఐదు కోట్లు... ఆరు కోట్లు అంటూ తమ ఇష్టం వచ్చిన అంకెలను చెపితే డబ్బులివ్వడానికి డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..? అని మండిపడుతున్నారట నిర్మాతలు. ప్రియాంకకు ఇచ్చిన షాక్ తో కత్రినాకైఫ్ కూడా తన రేటును తగ్గించుకున్నట్లు ప్రకటించిందట. మిగిలినవారు కూడా పారితోషికం గురించి అంతగా ఒత్తిడి చేసి మాట్లాడటం లేదట. మొత్తానికి ప్రియాంక తన రేటును పెంచి మిగిలినవారికి కూడా వాత పెట్టేసిందన్నమాట.