రియాలిటీ షోలో షార్ట్లిస్ట్ చేసి ముచ్చటగా ముగ్గురు వరులను ఎంపిక చేసింది రాఖీ సావంత్. ఆ తర్వాత ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిచేత తలవంచి తాళి కట్టించుకున్నానీ చెప్పింది. అయితే ఆ ముగ్గురు వరుల పేరంట్స్తో మాటామంతి జరపాలని, వారి ఆచార సంప్రదాయాలను తెలుసుకోవాలని వారి ఇళ్లకు బయలుదేరి వెళ్లింది.
సహజంగా అబ్బాయి తరపువారు అమ్మాయిల ఇంటికి వెళ్లి, మంచి చెడులు చూసుకుంటారు. రాఖీ మాత్రం దీనికి వ్యతిరేకంగా అబ్బాయిల ఇళ్లకే వెళ్లి వారి వ్యవహారాలను వడపోత పోసింది. ఈ తంతు ముగిసిన తర్వాత ఆ ముగ్గురిలో ఎవరిని వివాహం చేసుకుంటావు? అని ప్రశ్నిస్తే... చూస్తుండండి ఎవర్ని చేసుకుంటానో...? అంటోందట. ఇంకా సస్పెన్సే.
ఆమెతో సన్నిహితంగా మెలిగేవారు మాత్రం రాఖీ పెద్ద తిక్క మనిషి అనీ, గంటకో మాట మాట్లాడే అలవాటు రాఖీదని కొంతమంది వద్ద సన్నగా గొణుగుతున్నారట. ఇదిలావుండగా రాఖీ ఆ ముగ్గురిలో ఒక వరునిపై అమితంగా ప్రేమను పెంచేసుకుందట.
అతని పేరు ఎలీష్ పరుజన్వాలా. అతను కెనడాలో బడా వ్యాపారవేత్త. మూటలకు మూటలు డబ్బు గడించి ఇనప్పెట్టెల నిండుగా ఉంచాడట. బహుశా ఈ ధనవంతుడైన అబ్బాయినే రాఖీ పెళ్లి చేసుకుంటుందంటున్నారు.
రాఖీ మాత్రం అతని డబ్బును చూడలేదంటోందట. అతని లోపల ఉన్న మనిషినంతా పూర్తిగా చూసేసిందట. అతగాడి మనసు వెన్నకంటే మెత్తనైనదట. అతడు చాలా సున్నిత మనస్కుడని అతని కళ్లు చెప్పాయట. తను స్వయంవరం కార్యక్రమం చేస్తున్నప్పుడు తనపై అతనికున్న ప్రేమను ఆ కళ్ల ద్వారా బహిర్గతమవడాన్ని స్పష్టంగా గమనించానంటోందట రాఖీ సావంత్.
ఇంకేం.. ఎలీష్ను రాఖీ ఎగరేసుకుపోవడం ఖాయం.. అని అందరూ అనుకుంటుండగా.. వారి ఉత్సాహాన్ని బెలూన్లో గాలి తీసినట్లు తీస్తూ.. మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి. "నా కాబోయే మొగుడు ఎవరో నేను చెప్పేదాకా సస్పెన్స్" అని భేతాళ కథ టైపు ముగింపునిచ్చిందట. ఇదంతా చూస్తుంటే... రాఖీది కోతి- కొమ్మచ్చి మనసే అనిపిస్తోంది కదూ... ఏమంటారూ...?