దక్షిణాది చిత్రాల్లో అగ్రశ్రేణి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి రంభ.. ఐటంగర్ల్ రాఖీ సావంత్ బాటలో పయనించేందుకు సై అంటోంది. ఇటీవలే "దొంగసచ్చినోళ్లు" వంటి హాస్యభరితమైన చిత్రంలో నటించిన రంభ తాజాగా ప్రకాష్ రాజ్తో "ప్రతిక్షణం" అనే హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది.
మరోవైపు సినిమా ఛాన్సులు అంతగా రాకపోవడంతో వివాహం చేసుకునేందుకు రంభ సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. రాఖీ సావంత్ లాగానే స్వయంవరం ద్వారా వరుడిని ఎంపిక చేసుకోనుందని కోడంబాక్కం వర్గాలు కోడైకూస్తున్నాయి. దీంతో వరుడి కోసం రంభ కుటుంబీకులు అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో టీవీ షోలో స్వయంవరం నిర్వహించి వరుడిని ఎంపిక చేసుకోవాలని రంభ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రంభ స్వయంవరంకు సంబంధించి ఓ ప్రముఖ తమిళ ఛానెల్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అంతేకాదు.. స్వయంవరం చేసుకుంటే.. టీవీ షో ద్వారా భారీగా పారితోషికం రావడంతో పాటు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం కూడా జరుగుతుందని ఆమె సన్నిహితులు రంభకు సలహా ఇస్తున్నారట..!. మరి రంభ స్వయం చేసుకుంటుందో? లేదో? వేచి చూడాల్సిందే..!.