"జోష్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో అక్కినేని నాగార్జున తన పుత్రరత్నానికి ఎలాగైనా పెద్ద బ్రేక్ తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ మీనన్ తమిళంలో తీస్తున్న "విన్నైథాండి వరువాయా" చిత్రం హక్కులు తీసుకున్నట్లు సమాచారం.
తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిషనే తెలుగులో నాగచైతన్య సరసన నటింపజేయాలని గౌతమ్ సంకల్పించాడట. తెలుగుకైతే తన మార్కెట్ రేటు వేరుగా ఉందని త్రిష చెప్పడంతో అవాక్కయ్యాడట.
తమిళ నిర్మాతలు త్రిష పారితోషికాన్ని 60 లక్షలుగా నిర్ణయించి, అంతకు ఒక్కపైసా కూడా ఎక్కువ ఇవ్వటం లేదు. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కోటి రూపాయలు, అంతకు మించి కూడా ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నారట. కనుక నాగచైతన్య సరసన నటించాలంటే "కో..." అని అనాల్సిందే పట్టుపడుతోందట త్రిష.
మరీ అంత మంకుపట్టుబడితే గౌతమ్ మాత్రం ఏం చేస్తాడు. 60 "ల"కారాలకు ఓకే చెప్తే సరి... లేదంటే హాటెస్ట్ నటీమణి సమంతను తీసుకుంటానని ముఖం మీద చెప్పేశాడట. అయినా నాగచైతన్య సరసన త్రిష సూటవుతుందా...? ఏమంటారూ...?